జీఎస్టీ సవరించడం వల్ల పేదలకు మేలు : యార్లగడ్డ

Spread the love

జీఎస్టీ సవరించడం వల్ల పేదలకు మేలు : యార్లగడ్డ
గన్నవరం :
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బుధవారం ఉదయం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిఎస్టి పన్ను తగ్గించడం ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు ప్రతినెలా రూ.15 వందల రూపాయల వరకు ఆదావుతుందన్నారు. గడిచిన మూడు నాలుగు రోజుల్లో తాను పలు దుకాణాలలో విక్రయాలను పరిశీలించి కొనుగోలు దారులు, విక్రయదారులతో మాట్లాడగా పన్ను తగ్గింపు వల్ల వస్తువులు రేట్లు తగ్గినట్లు చెప్పారన్నారు. సరుకుల ధరలు తగ్గటం వల్ల కొనుగోళ్ళు పెరిగాయని తద్వారా వ్యాపారం పెరిగినట్లు తెలిసిందన్నారు. గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను కేసరపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కాఫీ షాప్ ను ప్రారంభించినట్లు వెంకట్రావ్ వివరించారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్రికెట్ బాక్స్లు ఏర్పాటు ద్వారా గ్రామాల్లో యువకులకు క్రికెట్ ఆడుకునేందుకు వీలు కలుగుతుందని ఇదే సమయంలో పంచాయతీ ఆదాయం వస్తుంది అన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో కొందరు అధికారులు సమస్యల పరిష్కారం పట్ల అలసత్వం వహిస్తున్నారని అలసత్వాన్ని వీడాలని యార్లగడ్డ హెచ్చరించారు. ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు యార్లగడ్డ తెలిపారు. పింఛన్ల పంపిణీ అనంతరం కేసరపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుంభకోణం కాఫీ షాప్ ను ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొడ్డళ్ళ చిన్న రామారావు, చిరుమామిళ్ల సూర్యం, బచ్చుల బోసు, గూడపాటి తులసి మోహన్, ఎం ఎల్ వి ప్రసాద్, సర్పంచ్ చేబ్రోలు మౌనిక, ఈవో ప్రసాద్, అన్నే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *