
విజయవాడ, తేదీ: 10.12.2025
• 58,204 మంది అంగన్వాడీ వర్కర్లకు రూ.75 కోట్లతో సెల్ ఫోన్లు
• ఐసీడీఎస్ రాష్ట్ర స్థాయిలో 98 శాతంతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానం
• గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు
• నూతన సాంకేతికతతో అంగన్వాడీ సేవలు అందించేందుకు 5 జి సెల్ ఫోన్లు
- మహిళాభివృద్ది శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5 జి మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ది శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
స్థానిక ఎన్టీఆర్ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5 జి స్మార్ట్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు రూ. 75 కోట్ల వ్యయంతో మొబైల్ ఫోన్లను పంపిణీ చేసామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4 జి ఫోన్ లు సరిగ్గా పనిచేయలేదని, అందుకే కూటమి ప్రభుత్వం 5 జి నెట్ వర్క్ తో ఫోన్ లు అందించామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 55,204 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్షా 25 వేల మంది సేవలు అందిస్తున్నారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు సచివాలయంలో శాఖల, మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. దీన్ని నూరు శాతం సాధించే దిశగా ఉద్యోగులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ర్యాంకింగ్ లో చివరి స్థాయిలో ఉండగా నేడు నాలుగో స్థాయికి తీసుకురావడం వెనుక ఉద్యోగులందరి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. గ్రామాల్లో తల్లిండ్రులు తమ చిన్నారులను నమ్మకం, ధైర్యం, విశ్వాసంతో అంగన్వాడీలకు పంపిస్తున్నారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా లో అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలను అందంగా తయారు చేయటానికి (పిల్లలను అందంగా అలంకరించటానికి) ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలంలోనే 3 సార్లు రూ. 1200 నుంచి రూ. 2,200 తిరిగి ఎన్ని ఆర్థికి ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 11,500 వరకు వేతనాలు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగేలా ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు. 7 వేల అంగన్వాడీల్లో 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, మిగిలిన అంగన్వాడీలలో ఉన్న టీచర్లకు 10 తరగతి అర్హత వచ్చిన అనంతరం మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో పనిచేసే సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటున్నామని ఆర్ధికంగా మీకు ఏం కావాలంటే అది చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అయినప్పటికీ ఊరికే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం తగదన్నారు. యాప్ లు తగ్గించమని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ధృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో మీకు కొత్త యూనిఫాం చీరలు అందిస్తామన్నారు. ప్రతీ అంగన్వాడీ సెంటర్ కు మౌలిక వసతుల కల్పనకు లక్ష రూపాయలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని అదేసమయంలో శాఖాభివృద్ధికి కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అంగన్వాడీ ఆయాల జీతాల పెంపుపై కూడా ధృష్టి సారించామని మంత్రి తెలియజేశారు.
మహిళాభివృద్ది, శిశు సంక్షేమం కార్యదర్శి ఏ. సూర్య కుమారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు వచ్చే వారి శాతం 70 శాతం ఉండగా, రాష్ట్రంలో 96 శాతంగా ఉండటం అంగన్వాడీల పనితనానికి నిదర్శనమన్నారు. అనంతరం బాల్య వివాహ రహిత ఏపీ పోస్టర్ ను ఆవిష్కరించారు..
కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమం శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కే. ప్రవీణా, జిల్లా ఇన్ ఛార్టీ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా భేగం, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
![]()
