5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
జగన్ పై మంత్రి సవిత ఫైర్
5 నెలల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం
చిన్న చెప్పల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి సవిత
కడప/కమలాపురం 33 మంది ఎంపీలతో 333 సార్లు ఢిల్లీ వెళ్లింది బాబాయ్ హత్య కేసు, ఇతర కేసుల నుంచి తప్పించుకోడానికేనని, గడిచిన 5 ఏళ్లలో కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని జగన్ పై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మండిపడ్డారు. ప్రజలు తమపై ఉన్న నిలబెట్టుకునేలా పాలన సాగిస్తున్నామని తెలిపారు. కమలాపురం నియోజకవర్గం
చిన్న చెప్పల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే పుత్త చైతన్య కృష్ణారెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ముందుగా సదస్సులో ఏర్పాటు చేసిన రెవెన్యూ, అటవీ, దేవాదాయ శాఖ రికార్డులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె సదస్సునుద్దేశించి ప్రసంగించారు. 5 నెలల కిందట సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచామన్నారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత వైసీపీ పాలనలో భూ అక్రమాలు, కబ్జాలపై బాధితుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తున్నామన్నారు.
నేనూ రాయలసీమ బిడ్డనే.
తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విమర్శించడం సరికాదని, 5 ఏళ్లలో మీరేం చేశారు… ఈ 5 నెలల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి సవిత సవాల్ చేశారు. తానూ రాయలసీమ బిడ్డనే అని, జగన్ 5 ఏళ్లలో చేసిందేమీ లేదని అన్నారు. అప్పట్లో తనకున్న 33 మంది ఎంపీలను ఢిల్లీకి 333 సార్లు పంపించి, బాబాయ్ గొడ్డలి పోటు హత్య కేసు, ఇతర కేసుల నుంచి బయట పడడానికి కాలం గడిపేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని జగన్ పై మంత్రి సవిత దుయ్యబట్టారు. అనంతరం మంత్రి సవిత..అర్జీలు దారులు నుంచి వినతులు స్వీకరించారు. 45 రోజుల్లో రెవెన్యూ సమస్యలకు పరిష్కారాలు చూపుతామన్నారు. గత వైసీపీ పాలనలో ఇటువంటి రెవెన్యూ సదస్సులు ఎప్పుడయినా నిర్వహించారా..? అని మంత్రి సవిత ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,