*రాష్ట్రంలో ప్రతీరైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానం*
*సాగులో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాం*
వ్యవసాయాధికారులు ప్రతీరోజు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులను అవగాహన పరచాలి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి
అగిరిపల్లి/ ఏలూరు, సెప్టెంబర్, 24 : రాష్ట్రంలోని ప్రతీ రైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలు శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలం సగ్గూరు లో మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయం, యువతకు ఉపాధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. దేశమంతా పట్టణీకరణ, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, తదితర కారణాలతోపాటు వ్యవసాయ పనులలో కూలీల కొరత ఒక కారణంగా వ్యవసాయం వైపు ఎవరూ మొగ్గుచూపడంలేదన్నారు. ప్రతీ రైతు సంతోషంతో వ్యవసాయం చేయడమేకాక, యువతను వ్యవసాయం వైపు మరల్చేందుకు వరి నాటు యంత్రాలు, పంటకోత మిషన్లు, డ్రోన్ల ద్వారా ఎరువులు పురుగుమందులు చల్లడం వంటివి సాగులో ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా డ్రోన్లలో కృత్తిమ మేధస్సు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. వీటిని కొనుగోలుకు రైతులకు ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీ ని అందిస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో రాష్ట్రంలో 70 నుండి 80 శాతం మంది కౌలు రైతులేనని, బ్యాంకర్లు అందించే పంట రుణాలు లక్ష కోట్లలో కేవలం వెయ్యి నుండి 2 వేల కోట్ల మాత్రమే కౌలు రైతులకు రుణాలు అందిస్తున్నారని, ఈ పద్దతిని మార్చి కౌలు రైతులందరికీ బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించేలా సాగుచేసే కౌలు రైతుల పేరిట సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యేలా వ్యవసాయ శాఖాధికారులు ధ్రువీకరణ పత్రాన్ని జారీచేస్తారన్నారు. ఈ ధ్రువీకరణ పత్రం ఆధారంగా బ్యాంకర్లు రుణాలను మంజూరు చేస్తాయన్నారు. వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వెళ్ళినప్పుడే పరిశోధనలకు సార్ధకత చేకూరుతుందన్నారు. వ్యవసాయ శాఖాధికారులు ప్రతీరోజు గ్రామాలలో పర్యటించి, సాగులో మెళకువలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు చేసిన సరికొత్త పరిశోధనలను చిన్న, సన్నకారు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు అవసరమైన మెళకువలను రైతులకు తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సమస్యను పరిశీలించి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన ధాన్యం బకాయిల సొమ్మును 1640 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా ఆస్థి, పంట నష్టపోయిన వారికి 15 రోజులలోనే పరిహారం అందించడం జరుగుందని, ఈనెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిహారాన్ని బాధితుల ఖాతాలో జమచేస్తున్నారన్నారు. ఏలూరు జిల్లాలో 5786 మంది రైతులకు 7 కోట్ల రూపాయల పంటనష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలో బుధవారం ముఖ్యమంత్రి వేస్తారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని త్వరలోనే పూర్తిచేసి నూజివీడు ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను తీరుస్తానని మంత్రి పార్థసారధి చెప్పారు. తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి నాగార్జునసాగర్ ద్వారా నూజివీడు ప్రాంత రైతులకు ప్రస్తుత వ్యవసాయ సీజన్లో సాగునీరు అందిస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నూజివీడు నియోజకవర్గంలో చెరువులకు గండ్లు పడ్డాయని, వాటిని 32 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు త్వరలోనే చేయిస్తామని మంత్రి పార్థసారథి ప్రజలకు హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశానికీ వెన్నుముక రైతన్నని, జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు తీసుకోవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వ్యవసాయాధికారులు ప్రతీ గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కలిస్తారన్నారు.
అనంతరం డ్రోన్ల ద్వారా పొలాల్లో ఎరువులు, పురుగుమందుల చల్లడం మంత్రి పరిశీలించారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖాధికారులు ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ను మంత్రి సందర్శించారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక జేడీ లు హబీబ్ భాషా, డా. నెహ్రు బాబు, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్, సూక్ష్మ సేద్య పధకం ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రవికుమార్, నూజివీడు వ్యవసాయాధికారి చాముండేశ్వరి, తాసిల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ అబ్దుల్ సత్తార్, స్థానిక నాయకులు, వివిద శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.