హైందవ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడ కేసరపల్లిలో చేపట్టిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు.. భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం వీ హెచ్ పీ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, హైందవ శంఖారావం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలన్నారు. విహెచ్ పీ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన హైందవ శంఖారావం కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు హాజరై సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆలయాల వ్యవస్థను రక్షించుకునేందుకు హిందువులంతా ఏకం కావాలన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసి అమానుషంగా ప్రవర్తించారన్నారు. హిందువులు శక్తివంతంగా మారకుండా నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరం ఒకే తాటిపై నిలబడి పోరాడాలన్నారు. పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి సౌజన్యంతో విశ్వ హిందూ పరిషత్ ప్రచారానికి ఇచ్చిన వాహనాలు గ్రామ, గ్రామాల్లో పర్యటిస్తూ చైతన్య పరుస్తాయన్నారు. హిందూ బంధువులందరూ ఐక్యంగా కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విహెచ్ పీ సహాయ కార్యదర్శి కొంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాలపై ప్రభుత్వ ఆజమాయిషి ని పూర్తిగా తొలగించాలన్నారు.హిందువుల ఐక్యతను చాటి చెప్పే హైందవ శంఖారావానికి ప్రతి ఒక్కరూ తప్పక హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవాని ప్రఖండ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, బిజెపి నేతలు బబ్బూరి శ్రీరామ్, బోయపాటి నాని చౌదరి, బి ఎస్ కే పట్నాయక్, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, పచ్చిపులుసు ప్రసాద్, పగడాల కృష్ణ, ముదిగొండ శివ, గూడెల శ్రీనివాసరావు, బెవర మురళి తదితరులు పాల్గొన్నారు.