*24.09.2024*
*పత్రిక ప్రకటన*
*రామాలయ రథం దగ్ధం ఘటన కలిచివేసింది*
– *వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు*
హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం
అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో రామాలయ రథం దగ్ధం ఘటన కలిచివేసిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. సనాతన ధర్మమంటూ గంటలకొద్దీ ఉపన్యాసమిచ్చే ప్రభుత్వ పెద్దలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన హిందువులకు గడ్డుకాలమని.. ఈ ప్రభుత్వంలో ఆలయాల ప్రతిష్ఠ మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, ఆలయ ఆస్తులపై దాడులు విపరీతంగా పెరిగాయని.. ప్రభుత్వ అసమర్థత వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. అనంతపురం ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వహించాలని.. దోషులను వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుమల తిరుపతి అనేది హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అని.. సాక్షాత్తూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి పుణ్యస్థలంలో స్వామీజీలు నిరసనలు చేపట్టడం సరికాదన్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్ లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.