Home Political news స్వచ్ఛత… శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే...

స్వచ్ఛత… శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే చెత్త నిర్వహణ బాధ్యత కాదు… ప్రజల్లోనూ చైతన్యం రావాలి

2
0

 స్వచ్ఛత… శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి

పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే చెత్త నిర్వహణ బాధ్యత కాదు… ప్రజల్లోనూ చైతన్యం రావాలి

ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలి

స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలి

ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలి

వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం

  గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో పాల్గొని, మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్   

‘స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య కార్మికులకో, క్లాప్ మిత్రలకో మాత్రమే బాధ్యత ఉంది అనుకోవద్దు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం అనేది మన అందరి బాధ్యత’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, నంబురూ గ్రామంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో  పవన్ కళ్యాణ్  పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ , పొన్నూరు ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర  పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే క్రమం వంటి విషయాలను స్వయంగా పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చెత్తను సేకరిస్తున్న విధానాన్ని  పవన్ కళ్యాణ్  పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలను నాటారు. చెత్త ట్రాక్టరును స్వయంగా  పవన్ కళ్యాణ్  నడిపి, స్వచ్ఛతలో తాను కూడా భాగమనే సందేశాన్ని నింపారు. 

ఈ సందర్భంగా విలేకరులతో  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘2047 వికసిత్ భారత్ లో స్వచ్ఛత అనేది ప్రధానం. కరోనా సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు, స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ఈ విషయంలో క్రమశిక్షణ అందరిలో మళ్లీ రావాలి. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది మనందరి జీవితంలో ఓ భాగం అనే దాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో చెత్త కనిపించని భారతదేశం సాకారం కావాలి. 

చెత్త నుంచి సంపద సృష్టి

చెత్తను వేరు చేయడం ద్వారా, దాన్ని మళ్లీ పునర్వియోగం కోసం ఉపయోగించడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు. చెత్తే కదా.. దానిని ఏం చేస్తాం అనే భావన కాకుండా, పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలి.  చెత్త నుంచి సంపదను సృష్టించాలి. అలాగే చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటు నిర్వహణ, వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు సైతం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంట్లోనే చెత్తను వేరు చేయడం, నిర్మూలించే కార్యక్రమం జరిగినపుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుంది. ప్రజల్ని నిత్యం జాగురూకుల్ని చేయడం, చైతన్యం తీసుకురావడం దీనిలో ప్రధానమైన భాగం. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయి కార్యక్రమాన్ని రూపొందించాలి. ఇటీవల జరిగిన కేబినెట్ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివన్ కార్యక్రమం ప్రతి నెలా మూడో శనివారం చేపట్టాలని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలి. ప్రజల్ని సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి.

బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి

ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వహణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఒకసారి మాట్లాడి వాటి నిర్వహణపై దృష్టిపెడతాం. కచ్చితంగా బయో వ్యర్థాలను నిర్వహణ అనేది స్వచ్ఛతలో కీలకమైంది. దీనిపై స్వచ్ఛంద సంస్థల సహాయంతోపాటు, ప్రత్యేక ప్రణాళికతో వీటి నిర్వహణను చేపడతాం. వీటి వల్ల కాలుష్యం ఎక్కువ కావడంతోపాటు, మానవ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆస్పత్రుల్లోనే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు కూడా వీటి నిర్వహణకు అవసరం. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తాం. క్లాప్ సిబ్బందికి వేతనాల విషయం కూడా నా దృష్టికి వచ్చింది. దీనిపై కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి వారి వేతనాలు పెంచేలా ప్రయత్నం చేస్తాం. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఎంతో కష్టపడి పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్న 35 మంది పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అమూల్యమైనవి. వారిని గౌరవించుకోవడం ప్రజలందరి బాధ్యతగా గుర్తించాలి’’ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్  కృష్ణతేజ, గుంటూరు జిల్లా కలెక్టర్  నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here