
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 18, 2025
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగేద్దాం
- పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను రోల్మోడల్గా మారుద్దాం
- లోటుపాట్లు లేకుండా అన్ని కోణాల్లోనూ పెట్టుబడిదారులకు చేయూత
- *డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మశ
- ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని.. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను రోల్మోడల్గా తీర్చిదిద్దడంలో సమష్టిగా కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. పారిశ్రామిక అనుమతులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తదితరాలతో పాటు వివిధ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జిల్లాకు సంబంధించి దాదాపు రూ. 69 వేల కోట్లతో 100 ఎంవోయూలు కుదిరాయని.. ప్రభుత్వం అన్ని కోణాల్లో పెట్టుబడిదారులకు అవసరమైన సహాయసహకారాలను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాకారానికి పారిశ్రామిక అభివృద్ధి కీలకమని.. ఇటీవల విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎంస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 17 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 6,037 దరఖాస్తులు రాగా 5,949 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని, మిగిలిన వాటిని నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద 18 క్లెయిమ్లకు రూ. 1.54 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు అత్యుత్తమ వాతావరణం రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఉందన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26కు సంబంధించి పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి.. దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)కు సంబంధించి షెడ్యూల్ ప్రకారం వర్క్షాప్లను నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీపీవో పి.లావణ్యకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, ఎల్డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, ఏపీఐఐసీ, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు కనకదుర్గ, మురళీకృష్ణ, వక్కలగడ్డ భాస్కరరావు, బుచ్చిబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
![]()
