*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 19, 2024*
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రాధాన్యమివ్వాలి
– సత్వర అనుమతుల జారీపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేయాలి
– పారిశ్రామిక యూనిట్లకు రూ. 6.03 కోట్ల మేర ప్రోత్సాహకాలకు ఆమోదం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధన దిశగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ప్రాధాన్యమివ్వాలని.. పారిశ్రామిక సత్వర అనుమతుల జారీకి సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. ఈ ఏడాది జులై 26 నుంచి డిసెంబర్ 19 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 151 దరఖాస్తులు స్వీకరించగా, ఇప్పటికే 133 ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించగా.. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020-23), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2023-27) కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై గత ఆగస్టు 22న స్క్రుటినీ కమిటీ సమావేశం 48 క్లెయిమ్లకు రూ. 2.21 కోట్లు, అదేవిధంగా డిసెంబర్ 18న జరిగిన స్క్రుటినీ కమిటీ సమావేశం 31 క్లెయిమ్లకు రూ. 3.82 కోట్లు మేర ప్రతిపాదనలు పంపగా.. వీటిపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయిపట్టి నడిపించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం పెంపు తదితరాలకు సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు వీలుకల్పించే ఎంఎస్ఎంఈ సర్వేను త్వరితగతిన పూర్తిచేసేందుకు చొరవచూపాలన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా తనిఖీలను విస్తృతం చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోణంలో సామాజిక బాధ్యతగా హరిత విస్తీర్ణం పెంపుపైనా పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు ప్రత్యేకంగా దృష్టిసారించేలా, ప్లాంటేషన్ డ్రైవ్స్ చేపట్టేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్డీఎం కె.ప్రియాంక, డీపీవో పి.లావణ్య కుమారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, పీసీబీ ఈఈ శ్రీనివాసరావు, ఫ్యాప్సియా ప్రతినిధి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
(