ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.17-06-2025.
సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త
మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలు చేస్తుంటారు జాగ్రత్త.
వివిధ పధకాల డబ్బులు పడే విధంగా చేస్తామని చెప్పి సైబర్ నేరగాళ్ళు డబ్బులు దోచేస్తారు.
నగరంలో తల్లికి వందనం పడిందా అని అడిగి వారికి మాటలు చెప్పి డబ్బులు దోచేసిన సైబర్ నేరగాళ్ళు
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాల నేపధ్యంలో నగరంలో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టినాయి.
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ళు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి ఫోన్ చేసి మీకు వివిధ పధకాల ద్వారా డబ్బులు పడేలాగా చేస్తాం అని మాయమాటల ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఈ విధంగా నున్న పోలీసు స్టేషన్ పరిదిలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మీకు తల్లికి వందనం పడలేదా మీ అక్కౌంట్ హోల్డ్ లో ఉంది అని చెప్పి వారి ద్వారా ఫోన్ నుండి పలు దఫాలుగా డబ్బులు వేరొక అక్కౌంట్ కు పంపించుకుని మోసం చేశారు.
కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా తెలియని వ్యక్తులకు మీ ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేయడం గాని, మీ బ్యాంక్ వివరాలను గాని, ఓ.టి.పి.లను గాని చెప్పరాదని, వివిధ పధకాలకు డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలు చేస్తారని ప్రజలు ఇటువంటి నేరాలపై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.