సైకిల్ తొక్కిన మంత్రి సవిత పెనుకొండ కడపలో మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ మహానాడుకు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా 44 మంది తెలుగు తమ్ముళ్లు పెనుకొండ నుంచి కడపకు సైకిల్ పై ర్యాలీగా బయలుదేరారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని మంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి వై జంక్షన్ వరకూ మంత్రి రెండు కిలో మీటర్ల మేర సైకిల్ తొక్కి వారిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం మంత్రి సవిత విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుంచి కడపలో మూడ్రోజుల పాటు జరిగే టీడీపీ పెద్ద పండగ మహానాడుకు నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు బయలుదేరారన్నారు. 44 మంది టీడీపీ కార్యకర్తలు పెనుకొండ నుంచి కడపలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణానికి సైకిల్ ర్యాలీగా బయలుదేరారన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడును నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
