*ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 4, 2024*
సీఎస్ఆర్ కింద రూ. 4 కోట్లు అందించిన డా. ఎన్టీటీపీఎస్
ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధిమీనాకు చెక్కు అందజేసిన సంస్థ అధికారులు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్రహీంపట్నంలోని డా. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా. ఎన్టీటీపీఎస్) రూ. 4 కోట్ల చెక్కును సోమవారం కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధిమీనాకు సంస్థ అధికారులు అందజేశారు. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు మార్గనిర్దేశనం మేరకు నిధులు సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా ఎన్టీటీపీఎస్ అధికారులు తెలిపారు. తాజాగా సమకూర్చిన నిధులతో విద్యుదుత్పత్తి కేంద్రానికి పరిసర ప్రాంతాలైన కొండపల్లి, ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు, గుంటుపల్లి, జూపూడి, తుమ్మలపాలెం, మూలపాడు, కిలేశపురం తదితర గ్రామాల్లో సీఎస్ఆర్ కార్యకలాపాలు చేపట్టాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ను కోరారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే మొక్కలు నాటడం, వైద్య, వెటర్నరీ శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రిడ్ డిమాండ్ ఆధారంగా షెడ్యూల్ ప్రకారం బ్యాలెన్స్ 3 యూనిట్ల ఓవర్హాల్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో సీపీవో వై.శ్రీలత, డా. ఎన్టీటీపీఎస్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్) సీహెచ్. వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు