*విజయవాడ, 05..10..2024*
సామాన్య భక్తుల సాఫీ దర్శనానికే మా ప్రాధాన్యం
వీఐపీ పాసులు ఉన్నవారు నిర్దేశ సమయాల్లోనే దర్శనానికి రావాలి
.
– జిల్లా కలెక్టర్ డా. జి సృజన.
దసరా ఉత్సవాలు మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారని.. క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శించుకుంటున్నారని ఏన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. దుర్గగుడి మీడియా పాయింట్ వద్ద అమె మాట్లాడుతూ సామాన్య భక్తుల సౌకర్యమే తమ ముఖ్య లక్ష్యం అన్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలు తమకు నిర్దేశించిన సమయాల్లోనే రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విఐపిల దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. అదే సమయాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. నిర్దేశించిన సమయాల్లో కాకుండా ముందుగా గాని తర్వాత గాని వస్తే 500 రూపాయల క్యూ లైన్లలో పంపుతామన్నారు. వీఐపీ పాస్ లు వున్నవారు ఈ సూచన గమనించి అమ్మవారి దర్శనానికి నిర్దేశ సమయాల్లోనే రావలసిందిగా కలెక్టర్ కోరారు.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ
దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. రూ. 300 టికెట్ దర్శనానికి వెళితే అరగంటలోపే దర్శనమవుతుందన్నారు. నవరాత్రుల సమయంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రించామని.. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సైబర్ క్రైమ్ గురించి ఈ వేడుకల్లో అవగాహన కల్పిస్తున్నామని సీపీ రాజశేఖర బాబు తెలిపారు.