ఉన్నత విద్యా కేంద్రంగా విజయవాడ
సహస్ర ఐఐటి జేఈఈ అండ్ నీట్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఉన్నత విద్యా కేంద్రంగా విజయవాడను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని సీతారాంపురంలోని యూనియన్ బ్యాంక్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర ఐఐటి – జేఈఈ అండ్ నీట్ అకాడమీని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా శనివారం ఉదయం పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యాభ్యాసం కోసం దేశంలోని వేరువేరు ప్రాంతాల నుంచి సుమారు 2లక్షలకు పైగా విద్యార్ధులు వస్తున్నారని అన్నారు. వారంతా విజయవాడలోని ఆయా కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. సహజంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న విజయవాడ నగరంలో అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థలు, మంచి అనుభవం కలిగిన శిక్షకులు కూడా ఉన్నారని నమ్మి వస్తున్న విద్యార్ధుల ఆకాంక్షలను నెరవేర్చేలా విద్యాబోధన ఉండాలని పేర్కొన్నారు. అలాగే నీట్, ఐఐటిలకు సంబంధించి విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధులే మొదటి పది ర్యాంకుల్లో ఉంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్న విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యతో కూడిన సహస్ర కాలేజ్ను నెలకొల్పడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. సహస్ర అకాడమీ ఛైర్మన్ బి.ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే హైదరాబాద్లోని హయత్నగర్, నెల్లూరు జిల్లా కావలిలో బ్రాంచ్లు ఉన్నట్లు తెలిపారు. విజయవాడలో 3వ శాఖను ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అన్నారు. తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు అనేక ఉత్తమమైన ఫలితాలు సాధించి నేడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. విజయవాడలో కూడా నాణ్యమైన విద్యాబోధన అందించడం ద్వారా తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ విద్యార్ధుల నుండి ఉత్తమ ఫలితాలు సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ జి.మల్లికార్జునరావు, సహస్ర కాలేజ్ ప్రిన్సిపాల్ డి.శివ శంకర్ రెడ్డి, లయన్ దేవినేని కిషోర్ కుమార్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు