ఎన్టిఆర్ జిల్లా తేది:04.12.2024
సమస్యల పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు..
జిల్లాలో ఈనెల 6 నుండి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నాం..
అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు..
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ
ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికను రూపొందించిన్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్య ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోదియాలకు వివరించారు.
ఈనెల 6వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించన్ను రెవెన్యూ సదస్సుల నిర్వహణపై రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్య ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోదియా, సిసిఎల్ఏ కమీషనర్ జి. జయలక్ష్మిలు జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల గురించి వివరిస్తూ ఈ నెల 6వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధితో పాటు విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయ పరిధిలో ఈనెల 6వ తేదీన రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు ప్రజలకు ముందుగానే తెలియపరిచేలా సదస్సుల షడ్యూలను కరపత్రాల రూపంలో ముద్రించి అన్ని గ్రామాలలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించే ఫిర్యాదులు విన్నతులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదస్సుల నిర్వహణ పర్యవేక్షణకు అధికారులను నియమించడం జరిగిందని ఒక్కోక్క మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుల పై 5వ తేదీ గురువారం జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు, జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆర్డివోలు తహాశీల్థార్లు, ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి సదస్సుల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నట్లు డా. లక్ష్మిశ వివరించారు.