Home public news శ్రీ‌వారి క‌ల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను స‌కాలంలో పూర్తి చేయాలి

శ్రీ‌వారి క‌ల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను స‌కాలంలో పూర్తి చేయాలి

4
0

 అమ‌రావ‌తి, 2025 మార్చి 12

శ్రీ‌వారి క‌ల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను స‌కాలంలో పూర్తి చేయాలి

టీటీడీ , జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలి 

టీటీడీ అధికారులు, జిల్లా అధికారుల‌ స‌మ‌న్వ‌య స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ J. శ్యామలరావు ఆదేశం

ఈ నెల 15 వ తేదీన వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణం లో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాలెంలో ఉన్న శ్రీ‌వారి ఆల‌య ప్రాంగ‌ణంలో బుధ‌వారం టీటీడీ అధికారులు, గుంటూరు జిల్లా అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మితో క‌ల‌సి ఆయ‌న‌ స‌మ‌న్వ‌యం స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీ‌నివాస క‌ల్యాణంపై వెంక‌ట‌పాలెం సమీపంలోని గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించాలన్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా క‌ల్యాణ‌ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌యం, క‌ల్యాణ వేదిక ప‌రిస‌రాల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా విద్యుత్ అలంక‌ర‌ణలు చేప‌ట్టాలన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి విచ్చేసి భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అంత‌రాయం త‌లెత్త‌కుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి వాహ‌నాల‌ను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పార్కింగ్ చేసేలా ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టమ్ ద్వారా సూచ‌న‌లు చేయాల‌ని కోరారు. 

క‌ల్యాణానికి భజన బృందాలు , శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాల‌ని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టి సీసీ కెమెరాల‌తో నిరంత‌రం భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. 

వివిధ ప్రాంతాల నుండి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స్వామివారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కొరకు శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .అత్యవ‌స‌ర స‌మ‌యంలో త‌క్ష‌ణం స్పందించేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు , మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాల‌న్నారు. భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవ‌స‌ర‌మైన శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేసుకోవాల‌ని చెప్పారు. సాయంత్రం 4 గంటలనుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు.

అనంత‌రం ఆయ‌న అధికారుల‌తో క‌ల‌సి క‌ల్యాణ వేదిక, త‌దిత‌ర ప‌రిస‌రాల్లో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించి ప‌లు సూచ‌నలు చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ స‌తీష్ కుమార్‌, వివిధ శాఖ‌ల‌ అధికారులు పాల్గొన్నారు.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here