ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 14, 2024
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
– క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదు
– సమష్టి కృషితో మాతా, శిశు మరణాల పూర్తిస్థాయి నియంత్రణపై దృష్టిపెట్టండి
– హైరిస్క్ గర్భిణీలకు అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించండి
– వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రాణంకంటే విలువైనది ఏదీ లేదని.. మాతా, శిశు మరణాలు సంభవించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో సమష్టి కృషితో మాతా, శిశు మరణాల పూర్తిస్థాయి నియంత్రణపై దృష్టిపెట్టాలని, వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో మాతా, శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. గత అక్టోబర్లో నమోదైన ఒక మాతృ, రెండు శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను పరిశీలించి, కారణాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి, అమలుచేయాలన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకునేలా, పోషకాహారం తీసుకునేలా, వైద్య సేవలు పొందేలా ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ, వైద్యులు.. ఇలా ప్రతిఒక్కరూ బృందంగా పనిచేయాలన్నారు. గ్రామస్థాయి సిబ్బంది గర్భిణీల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం, మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి గర్భిణీల ఆరోగ్యం వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, ముప్పు అధికంగా (హైరిస్క్) ఉన్నవారి పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అత్యంత అనుభవమున్న వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏ దశలోనైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం రుజువైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ), స్వర్ణాంధ్ర @ 2047 సాకారానికి చేసే కృషిలో భాగంగా జిల్లాలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్)ను 15కంటే తక్కువకు చేర్చేలా కృషిచేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత పీహెచ్సీల వైద్యులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డిప్యూటీ డీఎంహెచ్వో డా. ఐ.ఇందుమతి, లైజనింగ్ అధికారి డా. ఎస్.పద్మావతి, డీపీహెచ్ఎన్వో డా. లిడియా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.