అమరావతి
జూన్ 24, 2024
గనుల, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు
కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో స్వచ్చమైన పరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని, అత్యంత కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు నాకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తూ, సమర్ధవంతంగా పని చేసి, వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
వెలగపూడి సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్థులో కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
గత 2022 వ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఓఎన్ జిసి ఎక్స్ప్లొరెషన్ లైసెన్స్ రీ గ్రాంట్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం షరతుల మేరకు 2022 నుంచి 2040 వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ జరుగుతుంది.
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేసి, మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి పంపిణీ అత్యంత పారదర్శకంగా అమలు జరిపేందుకు, అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి, ప్రజావసరాల కనుగుణంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
మన రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులు ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామని, ఈ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తున్నానని మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తెలియ జేశారు.
మైన్స్ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్, డైరక్టర్ మైన్స్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాద పూరవకంగా మంత్రిని కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.