వేదాద్రి – కంచల ఎత్తిపోతలను బాగు చేయండి
పథకం పునరుద్ధరణ కొరకు 15 కోట్ల మంజూరుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లేఖ
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ – 22 జూన్ 2024
వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసి రైతులకు తక్షణమే నీరు ఇవ్వాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లేఖను సీఎం చంద్రబాబుకు, ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అందజేసారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పిమ్మట ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడును అసెంబ్లీ లో కలిసి లేఖను అందజేసారు. ఈ క్రమంలో గత టీడీపీ హయాంలో నిరాటంకంగా సాగిన ఎత్తిపోతల పథకం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూలనపడిందని ముఖ్యమంత్రికి వివరించారు. నిధులు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని సౌమ్య కోరారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించకపోవటం శోచనీయమన్నారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలసి వినతిని అందించారు. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిగామ, చందర్లపాడు మండలాల్లోని ఆయకట్టు ప్రాంతంలో అత్యధికంగా సాగునీరు ఈ స్కీం ద్వారా అందుతోందని, గత వైసీపీ హయాంలో పంపుల వైఫల్యం మరియు ఇతర పెద్ద మరమ్మతుల కారణంగా గత 3 సంవత్సరాల నుండి పనిచేసే పరిస్థితిలో లేదన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి మరియు 17366 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడానికి హామీ ఇవ్వడానికి వేదాద్రి – కంచల ఎల్ఐ స్కీమ్ పునరుద్ధరణ కోసం రూ.15.00 కోట్ల నిధులను మంజూరు చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు.