11.06.2025.
పొదిలి. ప్రకాశం జిల్లా.
వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి
పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి
వైయస్ జగన్ డిమాండ్
తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి
పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి
లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం
:ప్రభుత్వానికి వైయస్ జగన్ హెచ్చరిక
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు.
కనీస గిట్టుబాటు ధర కూడా రాక, సరుకు కొనేవారూ లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న శ్రీ వైయస్ జగన్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
కూటమి పాలనలో మళ్లీ తిరోగమనంలో వ్యవసాయం
దిక్కుతోచని స్థితిలో రైతన్నల ఆత్మహత్యల పర్వం
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రైతుల బలవన్మరణం
:కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ జగన్ ధ్వజం
ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమాకు మంగళం
తొలి ఏడాది రైతు భరోసా పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు
రెండో ఏడాది కేంద్రం ఇచ్చినా, రాష్ట్ర వాటా ఊసే లేదు
ఆర్బీకేలతో సహా, అన్ని వ్యవస్థలూ పూర్తిగా నిర్వీర్యం
తీవ్ర కష్టాల్లో రాష్ట్ర రైతాంగం. అయినా పట్టని ప్రభుత్వం
:పొదిలి పొగాకు బోర్డు వద్ద వైయస్ జగన్
పొదిలి:
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్న ఆయన, ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ హెచ్చరించారు.
పొదిలి పొగాకు బోర్డు వద్ద వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
మళ్లీ రైతు ఆత్మహత్యలు:
రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడుతున్న అవస్థలు ఎలా ఉన్నాయంటే.. రైతులను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సీజన్ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
కనీస మద్దతు ధర లేదు:
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ రైతులకు చెల్లించారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. అదే ఏడాది క్రితం వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు, రైతు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్క సంవత్సరంలో అది ఏ విధంగా దిగజారింది అని చెప్పడానికి నిదర్శనం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలు.
రైతు భరోసా లేదు:
గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబుగారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ గారు ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.
ఉచిత పంటల బీమా. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం:
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వ్యవసాయం జరుగుతోంది. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు.
అదే గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోంది.
వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు:
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారు. దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో ల్యాబ్లు ఏర్పాటు చేసి, వాటన్నింటినీ అందుబాటులోకి తెచ్చి, రైతులకు గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండే పరిస్థితిని వైయస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది.
ఇంకా గత మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం. అంతే కాకుండా,
జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా ఛార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేసిన పరిస్థితి, రైతు దళారీలకు అమ్ముకున్న పరిస్థితి. అదే మా ్రçపభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్ల కాలంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.
కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ:
కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటో వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి, ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను అక్కడే కూర్చోబెట్టి.. ప్రతి పంట కూడా ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా, వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్ డేట్ చేసేవారు. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.
పొగాకు మద్దతు« ధర:
ఇక పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా.. 2023–24లో కేజీ రూ.360 అంటే క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయిన పరిస్థితి. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. వీరంతా సిండికేట్ అయ్యి.. కాస్తో కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు.
కేవలం 40 మిలియన్ టన్నులు:
మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి వుంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం రూ.220 నుంచి రూ.260 మధ్యలో అమ్ముడుపోతున్న పరిస్థితి. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రాని పరిస్థితి నెలకొంది.
ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు. ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. అది కూడా ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి.
అదే గత మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల సగానికి వచ్చి సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్నాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
బ్లాక్ బర్లీ పొగాకు చూస్తే గత ఏడాది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.
వైయస్సార్సీపీ ప్రభుత్వం. పొగాకు రైతుకు స్వర్ణయుగం:
నాడు 2019లో ౖవైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం.
అదే ఈరోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.
ఆ ఘనత కూడా మాదే:
కేవలం పొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చిరైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్గా ఈ–క్రాప్ జరిగేది.
ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైయస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా 5 ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి.
రైతులను మోసం చేశారు:
చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువ పండించండి మేము కొనుగోలు చేస్తామని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పంటను కొంటామని హామీ ఇవ్వడం వల్ల వ్యవసాయ విస్తీర్ణం 30 శాతం పెరిగింది. కానీ చంద్రబాబు పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిన నేపథ్యంలో రైతులు ప్రతిదీ బ్లాకులో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు.
అక్కడా అదే డ్రామా:
అందరికి గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. మిర్చి పంటను క్వింటాల్ రూ.11,781 చొప్పున కొంటామన్న పెద్ద మనిషి చంద్రబాబును నేను అడుగుతున్నాను. ఎన్ని కేజీలు కొన్నారు?. ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. ఇక్కడ నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటాల్ కూడా కొనలేదు.
ఇతర పంటలదీ అదే దుస్థితి:
నిన్ననే మా ఆఫీస్కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1050 ఉండేది. కానీ ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606 కి పడిపోయింది.
ఆందోళన ఉధృతం చేస్తాం:
ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని వైయస్ జగన్ హెచ్చరించారు.