ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 8, 2025
విస్తృత జనజాగృతితో నవోదయానికి కృషిచేద్దాం
ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయండి
ప్రచార సామగ్రితోపాటు డిజిటల్ మెటీరియల్నూ రూపొందించాలి
నెఫ్రాలజిస్టు, డయాలసిస్ సేవలు నిరాటంకంగా కొనసాగాలి
సీకేడీ నివారణ, నియంత్రణ సమన్వయ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎ.కొండూరు కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ.. వివిధ శాఖల సమన్వయంతో విస్తృత జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నివారణ, నియంత్రణ పరంగా భవిష్యత్తు కార్యాచరణపై సమన్వయ సమావేశం జరిగింది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులపై ఈ ఏడాది జనవరి 18న జీజీహెచ్లో స్పెషలిస్టు వైద్యులతో పాటు గ్రామీణ నీటి సరఫరా, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, వ్యవసాయం, డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్, కాలుష్య నియంత్రణ తదితర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, వచ్చిన సూచనలపై తాజా సమావేశంలో చర్చించి, ఇకపై చేయాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీల్చే గాలిలో యురేనియం, కాడ్మియం, ఆర్సినిక్ తదితర ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? అనేదాన్ని నిర్ధారించేందుకు 20 రోజుల్లోగా పరీక్షలు నిర్వహించాలని కాలుష్య నియంత్రణ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా నెఫ్రో టాక్సిక్ మెటల్కు సంబంధించి సాయిల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా శాఖ ఒకవైపు సురక్షిత తాగునీటిని అందిస్తూనే మరోవైపు భూగర్భ జలాల నమూనాలను భార, హానికర మూలకాలపై ఐసీఎంఆర్, ఏఎన్జీఆర్యూ ల్యాబ్స్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నందున ఇళ్ల ఆవరణల్లోని నీటి వనరుల నమూనాలను కూడా పరీక్షించాలని సూచించారు. ఒకవైపు శాస్త్రీయ శోధనలు నిర్వహిస్తూనే ఈలోపు 3,600 గృహాలున్న 15 తండాలతో పాటు తండాయేతర ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే నవోదయం ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతోందని.. వీటిని విస్తరించాల్సిన అవసరముందన్నారు. కాపుసారాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వంటివి వాడకుండా చూడటం తదితరాలపై ప్రచార సామగ్రిని, డిజిటల్ కంటెంట్నూ రూపొందించాలని ఆదేశించారు. వినూత్నంగా కళాజాత ప్రదర్శనలు ఏర్పాటుచేయాలన్నారు. అదేవిధంగా నెఫ్రాలజిస్టు, డయాలసిస్ సేవలు నిరాంటకంగా షెడ్యూల్ ప్రకారం కొనసాగేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమావేశంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాస్, జీజీహెచ్ నెఫ్రాలజీ విభాగాధిపతి సీహెచ్ నాగేశ్వరరావు, డా. ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త డా. జె.సుమన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.