ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 07, 2025
విద్యార్థులకు కీలక సమయం అలసత్వం వద్దు
పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయండి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి
ఉపాధ్యాయులకు అత్యవసరమైతేనే శెలవు మంజూరు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయమని.. విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప శెలవులు పెట్టొద్దని.. జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ఉపాధ్యాయులను ఆదేశించారు.
మార్చి 17వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించన్నున నేపథ్యంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మూలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ ఆకస్మికంగా ఉదయం 8.55 నిమిషాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాహనం దిగి నేరుగా తరగతి గదులకు చేరుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు పదవ తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలిస్తూ పలు ప్రశ్నలు వేశారు. డిజిటల్ బోర్డుపై గణితం, సోషల్ స్టడీస్కు సంబంధించి విద్యార్థులతో సమాధానాలు రాయించారు. ఏ విషయాన్ని చదువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్యయనం చేయాలని.. అప్పుడే నేర్చుకున్న విషయాలు ఇప్పటి పరీక్షలకే కాకుండా జీవితాంతం ఉపయోగపడతాయని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎందరో తమ మేధస్సుతో, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ప్రశ్నిస్తూ, నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగారని.. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి, ఇష్టపడి చదువుకోవాలని సూచించారు.
అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టీని పరిశీలించి ఏడుగురు ఉపాధ్యాయులు శెలవు పెట్టడాన్ని గమనించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్న ఇలాంటి కీలక సమయంలో చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయులు సెలవులు వినియోగించడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిందన్నారు.
విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు సుమారు 40 రోజులు వ్యవధి మాత్రమే ఉందని ఈ సమయం ఎంతో కీలకమైనదన్నారు. ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన, నిబద్ధతతో విద్యార్థులపై దృష్టిపెట్టి పరీక్షలకు సన్నద్దం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. తద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యార్థుల తల్లిదండ్రులలో గౌరవం పొంది పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన వారవుతారన్నారు. విద్యార్థి సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఎదగాలంటే తల్లిదండ్రుల కంటే అధిక బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలేనన్నారు. పదవ తరగతి పరీక్ష పాస్ అయితే ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందని లేదంటే ఆ విద్యార్థి జీవితమే చదువు లేని వాడిగా మిగిలిపోతుందని ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. ఈ దశలో సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారికి అర్థమయ్యే రీతిలో బోధించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్దం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే పద్దతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యార్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒత్తిడిని తట్టుకుని పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. నూరు శాతం ఫలితాలను సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు పరీక్షలు పూర్తయ్యేవరకు ప్రతిరోజు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులపై కూడా అంతే శ్రద్ద కనపరచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ లక్ష్మీశ ప్రధానోపాధ్యాయునికి సూచించారు.
ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.డేవిడ్ రాక్ఫెల్లర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.వరప్రసాద్, వీఆర్వో సందీప్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు.