07-08-2025
విజయవాడ లోని మధురానగర్ – వాంబే కాలనీ మధ్య ఆర్.యు.బి నిర్మాణం అంశం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ కేశినేని శివనాథ్
రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్
మధురానగర్ – వాంబే కాలనీ మధ్య టూ లైన్ ఆర్.వో.బి నిర్మాణం పై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు
ఢిల్లీ : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మధురానగర్- వాంబే కాలనీ మధ్య రెండు లైన్ల రైల్వే అండర్ బ్రిడ్జ్ ను పూర్తిగా రైల్వే శాఖ నిధులతో నిర్మించేందుకు త్వరగా అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు.
పార్లమెంట్ లోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కార్యాలయంలో గురువారం ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన్ను కలిసి అభ్యర్ధన పత్రం అందజేశారు. వాంబే కాలనీ, అజిత్సింగ్ నగర్ ప్రాంతాల్లో ఒక లక్షకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, దినసరి వేతనాలపై జీవించే వీరు ఉపాధి, వైద్యం, విద్య కోసం విజయవాడ నగరానికి వచ్చేందుకు పది కిలోమీటర్లు తిరిగి రావాల్సి వుంటుంది. వీరు దగ్గర మార్గంలో విజయవాడ వచ్చేందుకు ప్రధాన రైల్వే లైన్ అయిన చెన్నై-హౌరా హైస్పీడ్ లైన్ దాటుతున్నారు. ఈ సమయంలో చాలా మంది ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు
ఈ ప్రాంత ప్రజలందరూ భవన నిర్మాణ పనులు, వెల్డింగ్ వర్కర్స్ గా, వాషింగ్ వర్కర్లు గా, హోమ్ అటెండెంట్లు గా రోజూవారీ పనులు చేసుకుంటూ జీవిస్తారని చెన్నై-హౌరా హైస్పీడ్ రైల్వే లైన్ దాటే సమయంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం వలన వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియజేశారు.
ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధన పై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించటమే కాకుండా రైల్వే శాఖ అధికారులకు మధురానగర్ – వాంబే కాలనీ మధ్య టూ లైన్ ఆర్.వో.బి నిర్మాణం పై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.