
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులపై ఆరా తీసిన ఎంపీ కేశినేని శివనాథ్
రైల్వే డీఆర్ఎమ్ మోహిత్ సోనాకియా తో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ రైల్వే సమస్యలపై చర్చ
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో వున్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా ను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. డీఆర్ఎంగా మోహిత్ సోనాకియా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు.మంగళవారం డి.ఆర్.ఎమ్. కార్యాలయంకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు.
ఈ భేటీ లో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవల్ క్రాసింగ్ గేట్ల అంశం పై చర్చించారు. అలాగే వాంబే కాలనీ – మధురానగర్ మధ్య ఎల్.హెచ్.ఎస్. నిర్మాణం త్వరగా చేపట్టాని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు , ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కె.ఎల్.రావు బ్రిడ్జ్ (ఎర్ర కట్ట) వద్ద ఆర్.యు.బి లు నిర్మించాలని కోరారు. అలాగే ఆర్.వో.బి, ఆర్.యు.బిల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిన లెవెల్ క్రాసింగ్ నెం. 316, లెవెల్ క్రాసింగ్ నెం. 147 , లెవెల్ క్రాసింగ్ నెం. 148, లెవెల్ క్రాసింగ్ నెం.8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి, ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించాలన్నారు.ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థనలపై డీఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు.
![]()
