విజయవాడ ఫిబ్రవరి 22 : వృత్తిరీత్యా జర్నలిస్టులు అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని
, అటువంటి వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నో యేళ్లు సొసైటీ తరపున ఇంటి స్థలం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ గురునానక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో యార్లగడ్డ వెంకట్రావును శనివారం పలువురు సీనియర్ జర్నలిస్టులు కలిశారు. ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం తరపున ఇంటి స్థలం కేటాయింపుకు సంబంధించి ఎమ్మెల్యే కు జర్నలిస్టులు వివరించారు. గన్నవరం నియోజకవర్గం, నున్న గ్రామ పరిధిలో ఉన్న సొసైటీ భూమిలో ఆక్రమణలు తొలగించాలని, అదే విధంగా ఆస్థలం సొసైటీకి ఇచ్చేలా ప్రభుత్వం తో మాట్లాడాలని జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. ఈ జర్నలిస్టు సొసైటీకి సంబంధించిన స్థలం గురించి, జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. 17 యేళ్లుగా ఈ సమస్య పై జర్నలిస్టులు తిరుగుతూనే ఉన్నారని, ప్రభుత్వాలు మారినా.. స్థలం కేటాయింపు పూర్తిగా జరగకపోవడం ఆశ్చరంగా ఉందన్నారు. ఈ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, ప్రభుత్వ పెద్దలకు కూడా వివరించి తన వంతు సహకారం అందిస్తానని జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు.