ఎన్టీఆర్ జిల్లా, మార్చి 06, 2025
విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి అధికారులు త్వరగా డీపీఆర్ల రూపకల్పనకు కృషి చేయాలి : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ , సీపీ ఎస్వీ రాజశేఖరబాబు లతో సమావేశం
విస్తృత ప్రజాప్రయోజన మౌలిక వసతుల పనులపై ప్రత్యేక దృష్టి
రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులకూ ప్రాధాన్యం
అభివృద్ధి పనుల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ రహదారులు
కాలువ కట్టల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్లు, ఫుడ్కోర్టుల ఏర్పాటుకూ చర్యలు
విజయవాడ రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన సవివిర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) రూపకల్పనపై వివిధ శాఖల అధికారులు కృషిచేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు సూచించారు.
గురువారం కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబుతో కలిసి రహదారులు, భవనాలు; విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరువరకు ఫ్లైఓవర్తో పాటు తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు పూర్తయితే విజయవాడ మరింత శరవేగంగా అభివృద్ధి పథంలో పయనించనున్న నేపథ్యంలో ఆ పనులు పూర్తయ్యేలోపు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై మ్యాపుల ఆధారంగా చర్చించారు. భవిష్యత్తులో ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా ఏర్పాటు చేయాల్సిన పార్కింగ్ స్థలాలు, వంతెనలు, జంక్షన్ల అభివృద్ధి, ప్రత్యామ్నాయ రహదారులు, రహదారుల అనుసంధానం తదితరాలపైనా చర్చించారు. రివర్బండ్ సుందరీకరణ, హిల్స్ రెయిలింగ్, కాళేశ్వరరావు మార్కెట్ జంక్షన్ సుందరీకరణ, గాంధీ హిల్ అభివృద్ధి, కేదారేశ్వరరావుపేట-టన్నెల్ రహదారి విస్తరణ, చిట్టినగర్ జంక్షన్ సుందరీకరణ, వాటర్ ఫౌంటెయిన్తో సితార జంక్షన్ సుందరీకరణ, టన్నెల్-గొల్లపూడి 200 అడుగుల రహదారి సుందరీకరణ, కృష్ణలంక కట్ట సుందరీకరణ, వాక్వేలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు, అంచనాలు, డీపీఆర్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ (యూడీఎఫ్), పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుల ద్వారా నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై సమావేశంలో చర్చించారు.
పార్కుల అభివృద్ధీ కీలకం
నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు వీలుగా ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త పార్కులనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని సమావేశంలో పేర్కొన్నారు. కెనాల్ వెంబడి చిన్నచిన్న పార్కులను అభివృద్ధి చేసి, హరితమయ వాతావరణంలో చిన్న ఫుడ్కోర్టులు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు నియోజకవర్గాల పరిధిలో సైక్లోన్ సెంటర్ల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, వీఎంసీ సూపరింటెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) సి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.