04-10-2024
విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జాయింట్ ఇన్స్పెక్షన్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎంపీలతో సమావేశం నిర్వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం
పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
రైల్వే అండర్ బ్రిడ్జిల పూర్తికి సానుకూలం
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమైన నాలుగు డ్రైన్ల సమస్య రైల్వే శాఖ తో ముడిపడి వుంది. గత ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేసి వుంటే విజయవాడ కి ఇటీవల వచ్చిన వరద కూడా వచ్చేది కాదు. డ్రైనేజీ పూడికలు తీసి వుంటే వరద వచ్చి వుండేది కాదు. రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, వి.యం.సి అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరగా…సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే విజయవాడ నగర పాలక సంస్థకి, విజయవాడ రైల్వే శాఖకి వున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
మధురానగర్ లోగల ఈ.టి.టి.సి కేంద్రం లో ఎపిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం ఎంపిలందరితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ కి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పూల మొక్క అందించి శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో వున్న రైల్వే ప్రాజెక్టులు జీఎం దృష్టికి ఎంపి కేశినేని శివనాథ్ తీసుకువెళ్లారు. ప్రధానంగా పశ్చిమనియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి రైల్వే శాఖతో ముడిపడి వున్న సమస్యను వివరించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియా మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైల్వేల్లో రాష్ట్రం వెనకబడిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి భూసేకరణ జరగలేదన్నారు. రైల్వే అధికారులు రైల్వే ప్రాజెక్ట్స్ కోసం ప్రపోజల్స్ పెట్టిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని..అందుకే రాష్ట్రంలో రైల్వే కి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పెరిగిపోయాయన్నారు. రైల్వే అధికారుల సహకారంతో చిత్తశుద్ధితో పనిచేసి ఆ పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వున్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించటం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్.వో.బిలు, రైల్వే అండర్ బ్రిడ్జ్ లు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు వంటి ప్రతిపాదనలపై చర్చించటం జరిగిందన్నారు. అమరావతి రాజధాని రైల్వే లైన్ కి సంబంధించి ప్రపోజల్ సిద్దం అయిందని, త్వరలో రైల్వే లైన్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. అలాగే రాజధానికి కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు కావాలని అడగ్గా రైల్వే అధికారులు రైల్వే బోర్డ్ కి సమాచారం అందించి అవి వచ్చేందుకు కృషి చేస్తామన్నారని చెప్పారు. ఇండియన్ రైల్వే స్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దూసుకుపోతుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులు పురోగమన దిశగా జరుగుతున్నాయన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి రైల్వే శాఖ నుంచి ఏమి కావాలో, ఏమి పనులు చేయించుకోవాలో అవన్నీ చేయించుకుంటామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఎంపి కేశినేని శివనాథ్ ప్రతిపాదనలు :
ముస్తాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వరద నీరు ప్రవహించేలా బుడమేరును వెడల్పు చేయడానికి అవసరమైన స్ధలాన్ని ఇవ్వాల్సి ఉంది
జగ్గయ్యపేట రైల్వేస్టేషన్ 30 సంవత్సరాల క్రిందట నిర్మించినది ఆధునికీకరణ జరగాలి
జగ్గయ్యపేట చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి.. అందువల్ల కార్గో ఆదాయం ఎక్కుగా ఉంటుంది..
జగ్గయ్యపేట రైల్వెస్టేషన్ లో పాసింజర్ రైళ్ళు ఆగే ఏర్పాటు చేయాలి
విజయవాడ రైల్వే స్టేషను లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం చాలా వుంది.
విజయవాడ రైల్వే స్టేషను లో ఎస్కలేటర్లు సరిగా పని చేయడం లేదు
కొండపల్లి, ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి ఆర్ఓబి లు త్వరగా ఆమోదించాలి
హౌరా రైళ్ళను విజయవాడ నార్త్ సెక్షన్ లో నుంచీ ఆపరేట్ చేయాలి
2023 మార్చి 2 రైల్వే జాయింట్ సర్వే ఆధారంగా ఆర్ఓబీల నిర్మాణం 100% రైల్వే ఖర్చుతో జరగాల్సి ఉంది
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలంలో LC No. 140 కొండపల్లి వద్ద, LC No. 147 ఎలాప్రోలు వద్ద ఆర్.వో.బి కి ఆమోదించాలని కోరటం జరిగింది.
అలాగే విజయవాడ రూరల్ మండలం LC No. 148 రాయనపాడు వద్ద ఆర్.వో.బి. తో పాటు ఆర్.యు.బి ఆమోదించాలి. LC No. 150 గోల్లపూడి వద్ద ఆర్.వో.బికి ఆమోదం తెలపాలి.