*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 07, 2025*
వాయు నాణ్యతలో విజయవాడను ముందంజలో నిలపాలి
సత్ఫలిస్తున్న పీసీబీ, వీఎంసీల విస్తృత కార్యక్రమాలు
మరిన్ని వినూత్న ఆలోచనలతో నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలినందిద్దాం
ఎలక్ట్రిక్/సోలార్ రిక్షాల వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించాలి
వాయు నాణ్యతను పెంచేందుకు డ్రోన్లను ఉపయోగించాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రజల ఆరోగ్య భద్రతకు పీల్చే గాలి అత్యంత కీలకమైందని, అది విషతుల్యం కాకుండా విజయవాడ అర్బన్ పరిధిలో పీసీబీ, వీఎంసీలు.. వివిధ శాఖల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలు సత్ఫలిస్తున్నాయని, ఇకపైనా మరిన్ని వినూత్న కార్యక్రమాలతో వాయు నాణ్యతను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) అమలుపై సమీక్షించేందుకు విజయవాడ నగర ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరుకాగా నగరంలో వాయు నాణ్యతను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల అమలు, అవి ఇచ్చిన ఫలితాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 నుంచి 2025-26 మధ్యకాలంలో గాలిలో పీఎం10 సూక్ష్మ ధూళికణాలను 20-30 శాతం మేర తగ్గించే లక్ష్యంతో ఎన్సీఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక భాగస్వామ్యంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కార్యక్రమాలతో పీఎం 10 స్థాయి 61.8కు తగ్గిందని, ఇది 2021-22లో 67గా ఉండేదన్నారు. వివిధ ప్రాంతాల్లో నాలుగు వాయు నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల ద్వారా ఏపీ పీసీబీ పీల్చే గాలి నాణ్యతను పరిశీలిస్తోందన్నారు. దుమ్మూధూళి లేని ప్రయాణానికి వీలుకల్పించేలా రహదారుల నిర్మాణం, పేవ్మెంట్ రహదారుల ఏర్పాటు, హరిత విస్తీర్ణం పెంపు, మెకానికల్ స్వీపర్ల సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర పనులను వీఎంసీ చేపట్టడం జరిగిందని.. వీటిని లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాయు కాలుష్యాన్ని బాగా తగ్గించేందుకు చొరవ చూపాలన్నారు. బ్యాటరీ వాహనాలతో పాటు పెద్దఎత్తున విద్యుత్, సోలార్
ఈ-రిక్షాలను ప్రోత్సహించాలని.. ఇందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద చేపట్టిన పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. హాట్స్పాట్లను గుర్తించి గాలి నాణ్యతను పెంచేలా మిస్ట్ స్ప్రింక్లింగ్కు డ్రోన్లను ఉపయోగించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
*సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు అడ్డుకట్టవేయండి:*
వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. భాగస్వామ్య పక్షాలతో జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని.. నిషేధిత వస్తువుల జాబితా, ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు తదితరాలను వివరించాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు వివిధ దుకాణాల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో నిషేధిత జాబితాలోని వస్తువుల వినియోగాన్ని అడ్డుకునేలా అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎస్వో ఎ.పాపారావు, డీఏవో డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.