వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి…
ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం
• క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి
• పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం
• సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉంది
• జనసేనలో చేరికల కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కె. నాగబాబు
• జనసేనలో చేరిన పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక
వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు
‘జనసేన పార్టీలో కొత్తగా చేరే వారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి, ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరికి నాగబాబు కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు మనందరికి ముఖ్యం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్దాం. అవసరంలో ఉన్న వారికి సేవ చేయాలని పవన్ కల్యాణ్ నేర్పించిన బాటలో నడవాలి. స్వప్రయోజనాల కోసం పార్టీని, రాజకీయాలను ఉపయోగించుకోవద్దు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే భావన పెట్టుకోవద్దు. జనసేనలో నాతో పాటు ఎంతో మంది నాయకులు పదేళ్లుగా పార్టీలో పని చేస్తున్నారు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించడం, పార్టీ బలోపేతం కోసం పని చేయడం మినహా స్వప్రయోజనాలను ఎన్నడూ ఆశించలేదు. సామాన్య కార్యకర్త కూడా అత్యున్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉంది” అన్నారు.
శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ “దేవుడి అభిషేకానికి కొందరు కాలువల నుంచి, ఇంకొందరు నదుల నుంచీ జలాలు తీసుకువెళ్తారు. ఏ నీరు తీసుకువెళ్లినా దేవుడికి అభిషేకించిన అనంతరం అది తీర్థంగా మారుతుంది. ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలు కూడా మన సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు చేరువవుతారు. ప్రజల కోసం నిలిచిన సామాన్యులకి ఇక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. జనసేన పార్టీ బలోపేతం కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఉంటుందనడానికి నిదర్శనం నేనే. పాత్రికేయుడిగా ఉన్న నేను పార్టీలోకి వచ్చాను. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో విప్ స్థాయికి రావడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ నేతలు అండగా ఉంటూ ప్రోత్సాహమే కారణం” అన్నారు. జనపార్టీ అధికార ప్రతినిధి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగబాబు సమక్షంలో జనసేనలో భారీ చేరికలు..
చిత్తూరు జిల్లా పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, వివిధ కార్పొరేషన్, మార్కెట్ యార్డు, విద్యాలయ, దేవాలయ కమిటీలకు చెందిన చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్, వైసీపీ జిల్లాస్థాయి నాయకులు, యువజన విభాగం నాయకులు, వ్యాపారస్తులు జనసేన పార్టీలో చేరారు. పీలేరు ఇంఛార్జి బి.దినేష్, నందిగామ. పుంగనూరు, చంద్రగిరి పి.ఓ.సి.లు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, సిరివేలు గంగాధర్, దేవర మనోహర్ తదితరులు పాల్గొన్నారు.