05.10.2024
వరద సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది వి
ష్ణు
వరద బాధితులకు అందించిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. బాధితుల్లో ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయన్నారు. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇటీవల రూ.1,036 కోట్లు ప్రకటించడంతో పాటు దాతలు పెద్దఎత్తున విరాళాలు అందించారని.. అయినా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం బాధాకరమన్నారు. 179 వార్డు సచివాలయాల పరిధిలో 14 వేల మంది మాత్రమే మిగిలినట్లు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి 50 వేల కుటుంబాలకి పైగా సాయం అందలేదన్నారు. కలెక్టరేట్ వద్ద నిత్యం పోటెత్తుతున్న బాధితుల రద్దీనే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరంలోని మొత్తం బాధితులు.. ప్రభుత్వం వారికి అందించిన సాయాన్ని గణాంకాలతో ప్రకటించాలన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంతమంది నివసిస్తున్నారు..? ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత మంది నివసిస్తున్నారు..? టూవీలర్ లు ఎన్ని..? ఫోర్ వీలర్ లు ఎన్ని..? ఆటో కార్మికులకు అందించిన సాయం వివరాలను వెల్లడించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి డీటీలు, రెవెన్యూ సిబ్బందిని తీసుకువచ్చి సర్వే నిర్వహించడంతో ఎన్యుమరేషన్ మొత్తం లోపాలతో నిండిందని.. ఈ ప్రాంతంలో ఉన్న వాలంటీర్లను వినియోగించుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. నెల రోజులు గడుస్తున్నా.. నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏవిధంగా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. గత పది రోజులుగా బాధితులు కలెక్టరేట్ చుట్టూ, వార్డు సచివాలయాల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండటం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నా.. ఈ ప్రభుత్వానికి కనీసం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే వరద బాధితులకు అందించిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి పరిహారం అందించకపోతే.. బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు.