లింగ ఆధారిత హింసను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి .జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
లింగ వివక్ష లేని సమ సమాజ స్థాపనకు సమష్టిగా కృషిచేద్దామని.. లింగ ఆధారిత హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. హింసకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఒకటే స్వరం.. వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం చట్టరీత్యా నేరం.. వరకట్న వేధింపులు హింసకు దారితీస్తాయంటూ
రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదేవిధంగా లింగ వివక్షను రూపుమాపడంలో తమవంతు పాత్ర పోషిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా గళం విప్పాలని, మనచుట్టూ జరిగే హింసను సహించవద్దని సూచించారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరికీ విద్యతో పాటు వారు ఉన్నతంగా ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని.. బంగారు భవిష్యత్తును అందించాలని అన్నారు. లింగ ఆధారిత హింస అనేది ఒక్క మహిళలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. అదో సామాజిక సమస్య అని.. దాన్ని రూపుమాపి, భావితరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిద్దామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ జె.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.