రోగుల సంతృప్తే సేవలకు ప్రాతిపదిక
సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్లు సమన్వయంతో పనిచేయాలి
*30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మరింత పటిష్టంగా అమలు చేయాలి*
*ఏపీ సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్లో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్*
అమరావతి, ఫిబ్రవరి 05
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల విషయంలో రోగులు సంతృప్తి చెందడమే ప్రాతిపదికగా డాక్టర్లు పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో(జిజిహెచ్లు) సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్లు సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాల్ని సాధించగలుగుతారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిజిహెచ్ల సూపరింటెండెంట్లతో ఐవిఆర్ ఎస్ ఫీడ్ బ్యాక్ పై బుధవారం వెలగపూడి ఏపి సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా, పరిశుభ్రత, మందుల సరఫరా, సిబ్బంది ప్రవర్తన, అవినీతి తదితర అంశాలపై ఐవిఆర్ ఎస్ సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఎక్కడెక్కడ లోపాలున్నాయో సవరించుకుని సేవల్ని మెరుగుపర్చుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక అమలు విషయంలో కొంతమేర ప్రగతి కనిపించినప్పటికీ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో స్ట్రెచర్లు, వీల్ చెయిర్లు లేక గర్భిణిలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి చిన్న చిన్న సమస్యల పట్ల దృష్టి సారించాలన్నారు. ఉదయం రోగుల్ని ఏ డాక్టరైతే చూస్తారో టెస్ట్ ల రిపోర్టులొచ్చాక సాయంత్రం అదే డాక్టర్ చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐవిఆర్ ఎస్ సర్వేలో వచ్చిన ఫిర్యాదులాధారంగా సేవల్ని మెరుగుపర్చేందుకు సూపరింటెండెంట్లు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, పేద రోగులు సంతృప్తి చెందేలా సేవలందించే విషయంలో ఏ మాత్రం తాత్సారం ఉండకూడదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఐవిఆర్ ఎస్ సర్వే ఆధారంగా సేవల్ని ఎంతమేరకు మెరుగుపర్చగలమనేది దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవల విషయంలో సూపరింటెండెంట్లే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఇ-హెల్త్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఇహెచ్ ఆర్) అందుబాటులోకొస్తే సేవలు మరింత సులభతరమవుతాయన్నారు. వైద్య విద్యా సంచాలకులు ( డిఎంఇ) డాక్టర్ నరసింహం వర్చువల్ గా పాల్గొన్నారు.