రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా..?
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్నులో అన్నదాతలు పడుతున్న అవస్థలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రైతులకు కనీసం సంచులు, రవాణా కూడా ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మిల్లర్లు, వ్యాపారులు లాలూచీ పడి ధాన్యం ధరను తగ్గిస్తున్నారని.. సాక్షాత్తూ కేబినెట్ మంత్రి ముందు అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేదన్నారు. అదే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకు రూ.1,550 వరకు గిట్టుబాటు అయిందని.. కానీ ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకు రూ. 1,420 కి మించి దక్కడం లేదన్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొన్నారని.. కానీ ఇప్పుడు తేమ నెపంతో మద్ధతు ధర కంటే మూడు వందలు తగ్గించడం సరికాదన్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికతో కల్లాలు, రహదారులపై ధాన్యం నిల్వ ఉంచిన రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని విష్ణు అన్నారు. కోలవెన్ను పరిధిలోనే వేల బస్తాల ధాన్యం బయట ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే రైతులకు సంచులు, రవాణా వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నదాతలను ఇబ్బంది పెడుతున్న మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.