రైతుబజార్లలో 284 ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు
ఎన్టీఆర్ జిల్లా, జులై 07, 2024*
*నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు
సామాన్యులకు అందుబాటులో ఉంచాలన్నదే లక్ష్యం*
– ఈ దిశగా సమష్టి భాగస్వామ్యంతో ప్రభుత్వం విశేష కృషిచేస్తోంది
– రాష్ట్ర వ్యాప్తంగా 284 ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పు విక్రయం
– త్వరలో చక్కెర, చిరు ధాన్యాలు వంటివి కూడా అందించేందుకు చర్యలు
– పకడ్బందీగా ప్రజా పంపిణీ వ్యవస్థ అమలుకు సమష్టి కృషి
– బియ్యం పక్కదారి పట్టడంపై ముమ్మర దర్యాప్తు
– రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో సామాన్యులకు సరసమైన ధరల్లో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తోందని.. ఇందులో భాగంగా బియ్యం, కందిపప్పును అందించేందుకు రైతుబజార్లలో 284 ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గురువారం విజయవాడ, ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్.. స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, డైరెక్టర్ వీరపాండ్యన్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జి.శేఖర్బాబు, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ తదితరులతో కలిసి బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు. కిలో కందిపప్పు రూ. 160, కిలో బియ్యం (స్టీమ్డ్ బీపీటీ) రూ. 49, కిలో బియ్యం (బీపీటీ రా రైస్) రూ. 48కే అందించే ఈ కౌంటర్ ద్వారా వినియోగదారులకు సరుకులను అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ సంక్షేమ పథకాలతో పాటు నిత్యావసర సరుకులను సరసమైన ధరల్లో సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు తదితరుల సమష్టి భాగస్వామ్యంతో కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల సమస్యను తమ కుటుంబ సమస్యగా భావించి, పరిష్కరించాల్సిన బాధ్యత వీరందరిపైనా ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బయట కిలో కందిపప్పు రూ. 181 ఉండటం వల్ల సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రమంతా ఒకే ధర అమలుకావాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. హోల్సేల్, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు వంటి వాటిలో కూడా రూ. 160కే కిలో కందిపప్పును అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చక్కెర, చిరుధాన్యాలు వంటివి కూడా అందించేందుకు కృషిచేస్తున్నామని.. వినియోగదారులు ఈ ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. రైతులతో పాటు వినియోగదారులకు కూడా లాభం చేకూరేలా పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 1,600 కోట్లు బకాయిపెట్టి వెళ్లిందని.. రైతుల సంక్షేమాన్ని, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 1000 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన రూ. 600 కోట్లను త్వరలోనే అందించనున్నట్లు వెల్లడించారు.
*ఎక్కడా ఎలాంటి అవినీతి జరక్కుండా పీడీఎస్ అమలు:*
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఎక్కడా ఎలాంటి అవినీతి లేకుండా లోటుపాట్లకు తావులేకుండా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారిపడితే చర్యలు తప్పవన్నారు. ఒక్క కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల మేర బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందని.. సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సామాన్యులకు అందాల్సిన సరుకులు వారికి సరైన విధంగా అందాల్సిందేనని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, డీఎస్వో జి.మోహన్బాబు, లీగల్ మెట్రాలజీ అధికారి ఎ.కృష్ణచైతన్య, అగ్రీ ట్రేడ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ (గొల్లపూడి) ప్రెసిడెంట్ పరుచూరి నాగేశ్వరరావు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ స్టేట్ ప్రెసిడెంట్ భాస్కరరావు, జిల్లా ప్రెసిడెంట్ రవి, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.