ఎన్టీఆర్ జిల్లా, మే 29, 2025 రేషన్ డీలర్లూ నమ్మకాన్ని నిలబెట్టండి కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయండి పండగ వాతావరణంలో జూన్ 1న రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్*రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. రేషన్ డీలర్లు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టి, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు.జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సన్నద్ధతను పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ దుకాణం పరిధిలో నిర్వహించిన ట్రయల్ రన్ను పరిశీలించారు. అనంతరం విజయవాడ సబ్కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ ఏర్పాటుచేసిన చౌక ధరల దుకాణాల ఈ-పాస్, వెయింగ్ మెషీన్ సేవా శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్.. పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ రేషన్ డీలర్లతో ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టనుందని, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ చేయాలని, అయిదో తేదీలోపే దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవచూపాలన్నారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వల్ల, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనాసరే కార్డుదారులకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రివర్యులు, ఉపముఖ్యమంత్రివర్యుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలన్నారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయడం, ధరలు, స్టాక్ బోర్డులను సరైన విధంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ-పోస్, వెయింగ్ మెషీన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రివర్యులు సూచించారు.సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీఎస్వో ఎ.పాపారావు, ఏఎస్వోలు, పౌర సరఫరాల డీటీలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
