
విజయవాడ, నవంబర్ 17/11/2025
రెవెన్యూ సేవలపై ప్రత్యేకంగా దృష్టిసారించండి
- పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లపై అవగాహన పెంపొందించండి
- పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి
- జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని.. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ…. పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ సేవలు పారదర్శకంగా అందించాలని, అవగాహన కల్పించాలని చెప్పారు. ఫ్లోచార్టు ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలా డివిజన్, మండల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. పిజిఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, అదే సమయంలో అర్జీదారుడికి సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
పీజీఆర్ఎస్కు 160 అర్జీలు:
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 160 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 50 అర్జీలు వచ్చాయి. పోలీస్ శాఖకు 23, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 13, పంచాయతీరాజ్కు 12, పురపాలక శాఖకు 11 అర్జీలు రాగా విద్య, డీఆర్డీఏ విభాగాలకు తొమ్మిది చొప్పున అర్జీలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు 6, సర్వేకు 4, విద్యుత్ శాఖకు 4, కళాశాల విద్యకు 3, గృహ నిర్మాణం 2, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్కు 2 అర్జీలు రాగా వివిధ శాఖలకు సంబంధించి 12 అర్జీలు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, జడ్పీ సీఈవో కే. కన్నమ నాయుడు, గ్రామ వార్డు సచివాలయాల సమన్వయ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
