ఎన్టీఆర్ జిల్లా తేదీ:18.12.2024
రెవిన్యూ సమస్యల పరిష్కారంలో బాధ్యతారాహిత్యాని సహించం..
• ఆలోచన ధోరణిని మార్చుకొని అంకితభావాన్ని ఆచరణలో పెట్టండి..
• జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించబోనని అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకొని అంకితభావాన్ని ఆచరణాలలో పెట్టడం ద్వారా సదస్సుల లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
జిల్లాలో జరుగుతున్న రెవిన్యూ సదస్సుల ద్వారా చేపట్టిన అర్జీల పరిష్కారంపై బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, రెవిన్యూ డివిజనల్ అధికారులు మండల తహశీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో రెవిన్యూ సమస్యల పరిష్కారంపై తహశీల్దార్లు చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవిన్యూ సదస్సుల లక్ష్యాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ప్రతి అర్జిపై శ్రద్ద పెట్టండని హెచ్చరించారు. తహశీల్దార్లు, ఆర్డీవోలు అర్జీలను వీలున్నంతవరకు పరిష్కారించాలని పరిష్కారం వారి పరిధిలో లేకుంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యల పరిష్కారంలో తప్పిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకూ, కోర్టుకేసులకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలను కూడా ప్రజలకు వివరించి, ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే పునఃపరిశీలన చేయడం జరుగుతుందన్నారు. నిర్దేశ షెడ్యూల్ ప్రకారం తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధితో పాటు అవసరం మేరకు అటవీ, దేవాదాయ శాఖల అధికారులు సదస్సులకు హాజరై సవిరించిన అర్జీలకు సమస్యలను సాధ్యమైనంతవరకు అదేరోజు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సదస్సులను అత్యంత పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, జిల్లాకు చెందిన మండల తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులు తదితరులు ఉన్నారు.