రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి
– ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేపై వర్క్షాప్ నిర్వహించారు. పైలట్గా ఎంపిక చేసిన ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామంలో సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు తీసుకెళ్లేందుకు సూచనలు చేశారు. రీసర్వే బృందాలు షెడ్యూల్ ప్రకారం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ సభల నిర్వహణ, ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (ఎఫ్పీవోఎల్ఆర్), తప్పనిసరి పర్యవేక్షణ, తహసీల్దార్ చెక్లిస్ట్తో పాటు వివిధ రకాల చెక్లిస్టులు, రీసర్వే పబ్లిసిటీ, గ్రామసభ నిర్వహణ, రోజువారీ పర్యవేక్షణ ప్రొఫార్మా తదితరాలను క్షుణ్నంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను భూ వివాద రహితంగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రీసర్వేకు సంబంధించి కూడా పిటిషన్లు వచ్చాయని.. ఈ నేపథ్యంలో తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు/రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లు, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు రీసర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమగ్ర ప్రణాళికతో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. వర్క్షాప్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, ల్యాండ్ రికార్డ్స్) టి.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.