*అధైర్య పడొద్దు… అండగా నిలుస్తా….!*
రాష్ట్రం నలుమూలల నుంచి వినతుల వెల్లువ
52వరోజు ప్రజాదర్బార్ కు బారులు తీరిన బాధితులు
అమరావతి: భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు… సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కన్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ స్వాంతన కల్పిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధితులు మళ్లీమళ్లీ తనను కలవకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ సూచించారు. నర్సరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి ఎలైన్ మెంట్ మార్పుచేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబుతో కలసివచ్చి లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు.
*మంత్రి లోకేష్ దృష్టికి వచ్చిన వినతులు*
– చీరాల ఓడరేవు నుంచి నకరికల్లు వరకు 167ఎ 4లైన్ల జాతీయ రహదారిని ఎన్ హెచ్ఎఐ అధికారులు 2022లో ప్రతిపాదించారు. ఇందులో అంతర్భాగంగా ఉన్న నర్సరావుపేట బైపాస్ నిర్మాణానికి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో నర్సరావుపేట దక్షిణం వైపు బైపాస్ కు ప్రతిపాదించిన ఆప్షన్ -3 వల్ల 5 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ -2ను అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబు నేతృత్వంలో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు.
– కరోనా సమయంలో తన బిడ్డ వైద్యం కుదువపెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గం తోటచర్లకు చెందిన గుమ్మడివెల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో నా బిడ్డ వైద్యం కోసం 120 గ్రాముల బంగారాన్ని కుదువపెట్టి మేనమామ వెంకటేశ్వరరావు వద్ద రూ.3లక్షలు అప్పు తెచ్చాం. వైద్యం చేయించినా మా బిడ్డ బతకలేదు. 2019 ఎన్నికల సమయంలో మా రెండో బిడ్డ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇద్దరు బిడ్డలను పోగొట్టుకొని కడుపుకోతతో ఉన్న మేము అప్పుగా తీసుకున్న రూ.3లక్షలు ఇస్తామని చెబుతున్నా బంగారం ఇవ్వడం లేదు. దీనిపై డిఎస్పీ నుంచి ఎస్ఐ వరకు పలుమార్లు కలిసినా న్యాయం జరగలేదు. తమ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా పద్మావతి కన్నీళ్ల పర్యంతమైంది.
– పుట్టుకతో తీవ్ర అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బద్వేలుకు చెందిన ఎల్.కొండమ్మ విన్నవించింది. ఒళ్లంతా పొక్కులతో కొలేడన్ బేబిగా జన్మించిన తమ బిడ్డకు తమిళనాడులోని కంచి కామకోటి హాస్పటల్ లో రూ.15లక్షలు ఖర్చుచేసినా ప్రయోజనం లేదు. కలెక్టర్ కు రెండుసార్లు విన్నవిస్తే కడప రిమ్స్ కు రాశారు. అక్కడ కూడా సరైన మందులు ఇవ్వడం లేదు. ప్రైవేటుకు కొనుగోలు చేస్తే ప్రతినెలా 10వేలు ఖర్చవుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని తమను పెన్షన్, ఆర్థికసాయం అందించి ఆదుకోండి.
– ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్లిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించాలని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం పల్లవోలుకు చెందిన మింగాల అశోక్ తండ్రి శ్రీనివాసులు విజ్ఞప్తిచేశారు. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిన బిడ్డ వైద్యానికి రూ.18లక్షలు ఖర్చయినా ప్రయోజనం లేదు. ఇప్పటికీ వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. లారీకి కుటుంబాన్ని పోషించే తాను కూడా పక్షవాతానికి గురయ్యాను. బతుకు బండి లాగడం భారంగా మారింది. ఆదుకోవాలని విన్నవించారు.
– వైసిపి నేతల అండతో ఓ వ్యక్తి విశాఖలోని తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గం మోపర్రుకు చెందిన కృష్ణప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ మాధవధారలోని సర్వే నెం.13/3లో 1991లో నేను 342 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాను. ఆ ప్రాంతానికి చెందిన సనపల సీతారాం అనే వ్యక్తి వైసిపి నేతల అండతో సర్వే నెంబర్ లోని ఏడు ఎకరాలు తమదేనని అంటున్నాడు. తమతోపాటు మరో నలుగుర్ని కూడా స్థలంలోకి అడుగుపెట్టనీయడం లేదు, న్యాయం చేయాలని కృష్ణప్రసాద్ కోరారు.
– అంగన్ వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని గుంటూరుజిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన మేస్త్రి గుంజి వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. 2018లో ముట్లూరులో 2, గారపాడులో ఒకటి అంగన్ వాడీ భవనాలు నిర్మించాం. ఇందుకోసం రూ.30లక్షల వెచ్చిస్తే గత టిడిపి ప్రభుత్వంలో రూ.11లక్షలు ఇచ్చారు. వైసిపి వచ్చాక అయిదేళ్లు తిప్పించుకొని 4లక్షలు ఇచ్చారు. వైసిపి రంగులు వేయడానికి మరో 6లక్షలు ఖర్చుచేయించారు. చెప్పులరిగేలా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. అప్పుల పాలైన తనకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని విన్నవించారు.
– కర్నాటకలో మెడిసిన్ చదువుతూ అదృశ్యమైన తమ బిడ్డ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి విన్నవించారు. కర్నాటక అర్తిబెళ్లిలోని ఆక్స్ ఫర్డ్ మెడికల్ కాలేజిలో నా బిడ్డ సురేష్ బాబు ఎంబిబిఎస్ ఫైనలియర్ చదువుతూ 100రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు తెలియలేదు. కర్నాటక పోలీసులతో మాట్లాడి తమ బిడ్డ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాల్సిందిగా కోరారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వీకరించిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.