20-02-2025
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా మైనారిటీ లకు ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట : మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్
దేశంలోనే మొదటిసారిగా ఇమామ్, మౌజమ్ లకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి ఎన్.ఎమ్.డి ఫారూఖ్, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లకు ధన్యవాదమలు
విజయవాడ : రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా మైనార్టీల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువగళం సమయంలో మంత్రి నారా లోకేష్ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్ లకు రూ.5 వేలు మసీదు కమిటీ ఎకౌంట్స్ లో వేయబోతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కి టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్ ధన్యవాదామలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మసీదుల్లో సేవ చేసే ఇమామ్, మౌజన్ల కు గౌరవ వేతనాల కింద రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పన మసీద్ కమిటీ ఎకౌంట్స్ లో జమ చేయబోతున్నందుకు టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదమలు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ఫతావుల్లాహ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఇమామ్ లకు రూ.5 వేలు, మౌజన్ లకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం మొట్టమొదటి సారిగా 2016లో ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కువ ముస్లిం వున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్.. ఆ రాష్ట్రంలో ఇమామ్, మౌజన్ లకు రూ. 3 వేలు మాత్రమే ఇస్తున్నారు.ఆర్థికంగా బలంగా వున్న తెలంగాణ రాష్ట్రంలో ఇమామ్, మౌజన్ లకు రూ.5 వేలు మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా మైనార్టీలకు ఇచ్చిన హామీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయకుండా ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్ లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నందుకు రాష్ట్రంలోని ముస్లిం మస్జీదు కమిటీల తరుఫున, ముస్లిం మత పెద్దల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను ఇమామ్, మౌజన్ లు కలిసి ఆగిపోయిన గౌరవ వేతనం పెంచి ఇప్పించాలని కోరటం జరిగింది. ఆ మేరకు కృషి చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం సామాజిక వర్గం అణిచివేతకు గురికావటమే కాదు….ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడన్నారు. ముస్లిం విద్యార్ధులు చదువుకునేందుకు ప్రవేశపెట్టిన విదేశీ విద్య, దుల్హన్ పథకం నిలిపివేసి మైనార్టీల సంక్షేమం అడ్డుకున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక ఫైల్ రూపంలో ఆయన టేబుల్ దగ్గర పెట్టుకున్నాడన్నారు. బడ్జెట్ లో మైనార్టీలకు రూ.4376 కోట్లు కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబు సొంతమన్నారు.
అలాగే మైనార్టీలక సంబంధించిన ఏ ఏ హామీలు ఎన్నికల ముందు ఇచ్చారో మైనార్టీ విద్యార్ధులకు విదేశీ విద్య పథకం, దుల్హన్ పథకం మైనార్టీ రుణాలు, మసీదు మర్మమత్తులకు నిధులు విడుదల ఇవ్వన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తారని తెలియజేశారు. న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి ఫరూక్ రాష్ట్ర నలుమూలల నుంచి మైనార్టీలకు ఏ సమస్య వచ్చిన తక్షణం స్పందిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మౌలానా అబ్దుల్ ఖదీర్, మౌలానా అబ్దుల్ సత్తార్ ఖాన్, మౌలానా మఖ్బూల్ , మౌలానా రహమతుల్లా, మౌలానా ఇక్బాల్ ఖాన్, మౌలానా ఫఖారుల్ ఇస్లామ్, మౌలానా ముఖీమ్ అఖ్తర్ తదితర మస్జీద్ ఇమామ్ లు పాల్గొన్నారు.