*విజయవాడ, తేదీ: 19.12.2024*
రాబోయే తరానికి దిక్సూచి క్రీడా యాప్
• *క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు*
• *దేశంలో డిజిటల్ సర్టిఫికెట్స్ అందించే తొలి రాష్త్రం ఏపీ*
– *రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి*
క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో గురువారం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడా యాప్ ను, క్రీడా పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందుకుని క్రీడారంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్నారు. క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు, క్రీడా పోటీల సమాచారానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే దిశగా క్రీడా యాప్ ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. క్రీడ యాప్ ద్వారా క్రీడాకారులకు ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేస్తారని, ఆయన సూచనల మేరకు రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి నూతన ఆలోచనలను పొందుపరచి, ఎన్నో విషయాల కలయికగా రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహకాల విషయంలోను, ఉద్యోగ అవకాశాల విషయంలోను క్రీడా విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఏ విధంగా ప్రోత్సహించాలి, అమరావతి కేంద్రంగా 2027 లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని, ఎన్నో అవమానాలను క్రీడాకారులు, అసోసియేషన్లు ఎదుర్కొన్నాయన్నారు. గత ప్రభుత్వం ద్వారా క్రీడా రంగంలో ఉన్న అందరికీ ఐదు సంవత్సరాలు కన్నీళ్లే మిగిలాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే క్రీడా పాలసీ, క్రీడా యాప్ తీసుకొని రావడం జరిగిందన్నారు. మహోన్నతమైన వ్యక్తి నాయకత్వంలో క్రీడా శాఖ ద్వారా రాబోయే భావితరాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేమందరం ముందుకెళ్తున్నామన్నారు. విద్యా శాఖ, క్రీడా శాఖలు అనుసంధానంతో గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండటం విద్యా శాఖ నుంచి క్రీడా శాఖకు తోడ్పాటు అందుతుందన్నారు. క్రీడా శాఖ లో ఫేక్ సర్టిఫికెట్లు అనే పెనుభూతాన్ని అంతం చేసి, టెక్నాలజీ పరంగా రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కే విధంగా ముందుకెళ్లుతున్నామన్నారు..
శాప్ ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టమని, క్రీడాకారులకు డిజిటల్ సర్టిఫికెట్స్ అందించడం నూతన విధానానికి అంకురార్పణ అన్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు క్రీడా పాలసీ ఉపయోగపడుతుందన్నారు. అర్హులకు పెద్దపీట వేయడానికి క్రీడా యాప్ ను తీసుకొచ్చామన్నారు. నకిలీ సర్టిఫెకెట్స్ ను అరికట్టడానికి క్రీడా యాప్ ఒక మంచి సాధనమన్నారు. ఎంతో మంది క్రీడాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్ఫూర్తి అని అన్నారు. క్రీడా యాప్ లో అసోసియేషన్ల ద్వారా గాని, స్కూల్స్ ద్వారా గాని ప్రవేశం పొందవచ్చన్నారు.
క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్ మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం క్రీడా యాప్ ఒక పెద్ద ముందడుగు అన్నారు. క్రీడా యాప్ కోచ్ లకు, క్రీడాకారులకు అందరికీ ఉపయోగపడుతుందన్నారు.
శాప్ వీసీ మరియు ఎండీ గిరీషా మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఒక మంచి క్రీడా పాలసీ తీసుకొచ్చామన్నారు. ఒలింపిక్స్ లో పతకాలు తీసుకొచ్చే వారు తెలుగు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లు ప్రకటించటం క్రీడలకు మంచి ప్రోత్సాహకరమన్నారు.
కార్యక్రమంలో ఆర్చరీ క్రాడాకారిణి జ్యోతి సురేఖ, కరాటే క్రీడా కారిణి పూజ, క్రీడాకారుల అసోషియేషన్లు, సంఘాలు, కోచ్ లు తదితరలు పాల్గొన్నారు.