రానున్న ఐదేళ్లల్లో రాష్ట్రంలోని 20 లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు
సాఫ్ట్వేర్, పరిశ్రమల అభివృద్ధికి చర్యలు
నూజివీడు/ఏలూరు, సెప్టెంబర్, 21 : రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక 8వ వార్డులో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో ఎన్ .డి. ఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలియజేసి, అక్కడ ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ప్రమాణస్వీకారం అయినవెంటనే 3 వేల రూపాయలు పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కలిపి అందించామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహరం అందించేందుకు అన్నా క్యాంటిన్లను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం ప్రాధమిక విద్యను నిర్లక్ష్యం చేసిందని, ఒక్క ఉపాధ్యాయుల పోస్టును కూడా భర్తీ చేయకుండా పాఠశాలలకు రంగులు వేయడానికే ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసినవెంటనే 16 వేల 700 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించారని, వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించేనాటికి కొత్తగా నియామకం చేసిన ఉపాధ్యాయులు బాధ్యతలు చేపడతారన్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం సాగునీటి శాఖను, లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశ్రమల ఏర్పాటును నిర్లక్ష్యం చేసిన కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, సరైన రోడ్ల సౌకర్యాలు లేని కారణంగా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టాలెక్కించడానికి విజన్ గల నాయకుడు నారా చంద్రబాబునాయుడు ఒక్కడే అని నమ్మి ప్రజలు రికార్డు స్థాయిలో సీట్లు అందించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రానున్న ఐదేళ్లల్లో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారన్నారు. పరిశ్రమల స్థాపనకు పలు ప్రోత్సాహకాలు అందించి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టామని, వీటి ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. సాఫ్ట్వేర్ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధిలోకి తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. త్రిబుల్ ఐటీ లో ఇంక్యూబెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రతిపక్ష నాయకుడు కేవలం విమర్శలకు పరిమితమైతే, 70 ఏళ్ల వయస్సులో కూడా బురదలో కూడా ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ట్రాక్టర్లు, ప్రొక్లైనర్ల ఎక్కి ప్రజలకు సహాయ కార్యక్రమాలను అందించి విపత్తు కాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసాను ప్రజల్లో ముఖ్యమంత్రి కల్పించారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించామని మంత్రి చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలియజేసారు.
ఈ సందర్భంగా తనను కలిసి సమస్యలను తెలిపిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ 8వ వార్డులో ప్రజల ఉపయోగార్థం కమ్యూనిటీ హాలులో నిర్మిస్తానని, అర్హులైన ప్రతీ కుటుంబానికి పక్కా గృహం మంజూరు చేస్తానని, నూజివీడు పట్టణంలో ఎక్కడా త్రాగునీరు సమస్య లేకుండా చూస్తానని, అవసరమైన ప్రదేశాలలో బోర్లు ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నూజివీడు మార్కెట్ యార్డ్ ను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని, యార్డు లో వాణిజ్య కార్యకలాపాల ద్వారా మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు వీలు అవుతుందన్నారు.
కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ రామిశెట్టి త్రివేణి దుర్గ, మునిసిపల్ కమీషనర్ ఆర్. వెంకట్రామిరెడ్డి, డీఈ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, ప్రముఖులు బర్మా ఫణిబాబు, కాపా శ్రీనివాసరావు , తలపంటి రాజశేఖర్, చెరుకూరి దుర్గాప్రసాద్, మున్సిపల్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.