రాజకీయాలు మానేద్దాం..విజయవాడలో పారిశ్రామిక రంగ అభివృద్ది కోసం ఆలోచిద్దాం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీయస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ సందర్శన*
*udyam రిజిస్ట్రేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్*
*ఆటో మొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు*
*రాజధాని అమరావతి ప్రాంతానికి స్పోర్ట్స్ సిటీ క్లస్టర్, లెదర్ క్లస్టర్, డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావటం కోసం ఎంపి కేశినేని శివనాథ్ ప్రయత్నం*
ఆటోమొబైల్ ఇండస్ట్రీను అభివృధ్ది చేయటమే లక్ష్యమన్న ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : ఒకప్పుడు హైదరాబాద్ కి ధీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఆటోమొబైల్ రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ది కావాల్సిన సలహాలు సూచనలు అందించాలి. రాజకీయాలు మానేద్దాం…విజయవాడ అభివృద్ధి గురించి ఆలోచిద్దామంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆటోనగర్ లోని ఆంధ్రప్రదేశ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీయస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ ను సందర్శించారు. ఈ సెంటర్లో ఉచితంగా ఏర్పాటు చేసిన udyam రిజిస్ట్రేషన్ సెంటర్ ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీయస్ అసోసియేషన్ , విజయవాడ ఇండస్ట్రీయల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అసోసియేషన్ , జె.ఆర్.డి ఐలా సర్వీస్ సోసైటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మహిళ పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆటోమొబైల్ రంగంలో పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి, ఆటో మొబైల్ రంగానికి పునర్వైభవం తీసుకురావాటానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనే అంశం పై పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డి. రామకృష్ణ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తను తయారు చేసిన నివేదిక ఎంపి కేశినేని శివనాథ్ కు అందజేశారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు హైదరాబాద్ కి ధీటుగా విజయవాడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వుండేది..ఆ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ఒక ఇండస్ట్రీ కూడా రాష్ట్రానికి రాలేదు. అంతే కాదు కేంద్రప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అందించే పథకాలు, సబ్సిడీల గురించి ప్రజలకు అవగాహన కల్పించక పోవటం వల్ల ఎక్కువగా ఎవరు ఉపయోగించు లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల స్థాపనలో రాష్ట్రం చాలా వెనకబడిందని…. ఎమ.ఎస్.ఎమ్.ఈలు నెలకోల్పటంలో తమిళనాడు,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందు వున్నట్లు తెలిపారు. .
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేయటం కోసం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటం కోసం చాలా పథకాలు అమలు చేయటం తోపాటు, నిధులు కేటాయించిందన్నారు.
ఒకే విధమైన పనిచేయాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆటో మొబైల్ అసోసియేషన్స్ ఒక క్లస్టర్ గా ఏర్పడితే…కేంద్ర ప్రభుత్వం మొత్తం 90 శాతం సబ్సిడీ అందజేస్తుందన్నారు. 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మిగిలిన పది శాతం మాత్రమే ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్లు పెట్టుకోగలిగితే చాలన్నారు.ఇలాంటి పథకాలు వినియోగించుకోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అభివృద్ది చెందటానికి ముందడుగు వేయాలన్నారు.
అలాగే పారిశ్రామిక వేత్తలందరూ బిఎస్6 వాహనాల టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఎలాంటి సిల్క్ డెవలప్ మెంట్ సెంటర్ ఆలోచించుకుని చెప్పాలన్నారు.
అలాగే రాబోయే కాలంలో నెలకొల్పబోయే ఇండస్ట్రీలకు అనుగుణంగా యూనివర్శిటీల్లో ఎలాంటి కోర్సుల్లో ప్రవేశ పెట్టాలనే అంశం పై కూడా ఆలోచించాలని సూచించారు. రాబోయే ఇండస్ట్రీ లకు అవసరమైన కోర్సులు విద్యాసంస్థలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు.
ఈ అంశాలతోపాటు ఇండస్ట్రీలను నెలకొల్పటానికి కావాల్సిన స్థలం, అవసరమైన ఇన్ ఫ్రా గురించి పూర్తి సమాచారంతో ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తే అందరం కలిసి చర్చించుకుని కావాల్సిన వాటిని సీఎం చంద్రబాబు తో మాట్లాడి తెచ్చుకుందామన్నారు.
అదే విధంగా అధికారంలో వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం తో విజయవాడ నగరాభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పారిశ్రామికంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు కి ఇండస్ట్రీల ఏర్పాటు కి స్థలం సరిపోవటం లేదు విజయవాడను గ్రేటర్ విజయవాడ గా మార్చాలని అడిగితే, త్వరలో గ్రేటర్ అమరావతి రాబోతున్నట్లు, అందులో విజయవాడ కార్పొరేషన్, అమరావతి కొర్పొరేషన్ వుండనున్నట్లు చెప్పారని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త లక్ష్య సాధన కోసం తాను విజయవాడ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో ఫైలెట్ ప్రాజెక్ట్ గా 32 గ్రామాలు దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ గ్రామాలకు చెందిన 32 మంది వ్యక్తులను హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఉపాధి అవకాశాలపై వారం రోజుల శిక్షణ కార్యక్రమానికి పంపించటం జరిగిందన్నారు. వీరిని కలవటానికి ఆదివారం (రేపు) హైదరాబాద్ వెళుతున్నట్లు తెలిపారు. శిక్షణ ఇప్పించిన వారందరితో వారి గ్రామాల్లో ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 295 గ్రామాలను అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ ప్రెసిండెంట్ బాయన వెంకట రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమని కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడే ప్రజాప్రతినిధులను చూశాను కానీ, తమ దగ్గరకి వచ్చి ఆటోమొబైల్ రంగం అభివృద్ది కోసం సలహాలు , సూచనలు అడిగిన ఎంపి కేశినేని శివనాథ్ ఒక్కరే అంటూ కొనియాడారు. ఎంపి కేశినేని శివనాథ్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆటోనగర్ కి పున్వరైభవం తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా నిలుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ ఎమ్.ఎస్.రామచంద్రరావు, విజయవాడ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెక్రటరీ టి.వి.నాగేశ్వరరావు, జె.ఆర్.డి టాటా ఐలా సర్వీస్ సోసైటీ చైర్మన్ టి.వినోద్ బాబు, ఎపిఐఐసి ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్, విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ఎమ్.డి అండ్ చైర్మన్ ఎ.శివ నాగేశ్వరరావు లతోపాటు అసోసియేషన్ సభ్యులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.