ఎన్టీఆర్ జిల్లా, జూన్ 12, 2025
యోగా వైద్యో నారాయణో హరి..
ఔషధాన్ని మించిన ఔన్నత్యం యోగాసనాలది
డాక్టర్స్ థీమ్తో విజయవంతంగా 23వ రోజు యోగాంధ్ర కార్యక్రమం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రాణాలను నిలబెట్టే వైద్యుణ్ని భగవంతుడితో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అంటారని… అయితే అనారోగ్యాన్ని దూరం చేసేందుకు వైద్యులిచ్చే ఔషధాన్ని మించిన ఔన్నత్యం యోగాసనాలదని.. యోగాచరణ ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర 23వ రోజు కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్స్ థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వైద్య ప్రముఖులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాసనాల అభ్యసనను చిన్నప్పటి నుంచి జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఒత్తిడి లేని జీవితం పొందవచ్చన్నారు. మనిషి అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాలు రక్షణ కవచంగా ఎలా ఉపయోగపడతాయో ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతివర్గానికి యోగాను చేరువచేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. స్వర్ణాంధ్ర దార్శనికత దిశగా చేసే ప్రయాణంలో సుసంపన్న, ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డా. ఉషారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డా. హనుమయ్య, ఫాగ్సీ ప్రతినిధి డా. త్రిపుర, రమేష్ హాస్పిటల్ వైద్యులు డా. పి.రమేష్,
జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామత్లేహి, డా. జె.సుమన్, డా. రత్నప్రియదర్శిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, వైద్యనిపుణులు డా. సింగరి ప్రభాకర్, డా. కోడె ప్రభాదేవి, ఆయుష్ ఆస్పిటల్ వైద్యులు డా. రమేష్, అనిల్ న్యూరో వైద్యులు డా. అనిల్, అమెరికాన్ ఆంకాలజీ వైద్యులు డా. సుబ్బారావు, హృదలాయ హాస్పిటల్స్ వైద్యులు డా. శివప్రసాద్, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతినిధులు, నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.