*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 10, 2024*
యువ ప్రతిభా కృష్ణా తరంగం
విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా ప్రారంభమైన కృష్ణా తరంగ్-2024
– యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష
– సుస్థిర ఉపాధి అవకాశాలకు వీలుకల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర
యువతీయువకుల ఆనందోత్సాహాల తరంగాల మధ్య కృష్ణా విశ్వవిద్యాలయ కృష్ణా తరంగ్ – 2024 అంతర కళాశాలల యువజనోత్సవం మంగళవారం విజయవాడ, కొత్తపేటలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల (కేబీఎన్)లో ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అంతర కళాశాలల యువజనోత్సవ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు.
యువతలోని ప్రతిభాపాటవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలోనే స్కిల్ సెన్సస్కు శ్రీకారంచుట్టడం జరిగిందని.. యువతలోని నైపుణ్యాలు ఏంటనేవి నమోదు చేసి.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సుస్థిర ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించడం జరుగుతుందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాల నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర @ 2047పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని.. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలన్న తపనతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల గతంలో ఎప్పుడూ ఎక్కడాలేని విధంగా ఒకేరోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి మేధస్సు మరింత ఇనుమడించేలా, మరింత గుర్తింపు వచ్చేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషిచేయాలని మంత్రి కొల్లురవీంద్ర సూచించారు.
కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఇన్ఛార్జ్) ఆర్.శ్రీనివాసరావు, రెక్టార్ ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ కె.శోభన్బాబు, కృష్ణా తరంగ్ కన్వీనర్ డా. ఎం.కోటేశ్వరరావు, కేబీఎన్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ టి.శ్రీనివాస్, ప్రిన్సిపల్ డా. జి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.