ముసునూరు మండలంలో రోడ్లు,డ్రైనేజ్, త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం-గృహ నిర్మాణ,.సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
సాధారణ వ్యక్తిలా ఆరుబయట అరుగుమీద కూర్చొని, ప్రజల సమస్యలను అడిగితెలుసున్న మంత్రి
ముసునూరు, అక్టోబర్, 15 : ముసునూరు మండలం త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి ప్రజలకు హామీ ఇచ్చారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలో 15. 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న 5 సిసి రోడ్ల పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, రోడ్లు పాడై పోయి చాలా ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేదని ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్ఠికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయత్రీ రాజ్ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. పాడైన రోడ్ల స్థానంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తానని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడమే ‘పల్లె పండుగ’ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల ఇళ్లవద్దకు వెళ్లిన మంత్రి పార్థసారథి సాధారణ వ్యక్తిలా వారి ఆరుబయట గట్టుపై కూర్చొని వారి సమస్యలను మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకోవడం చూసిన ప్రజలు మంత్రి నిరాడంబరతను చూసి ఆశ్చర్యపోయారు.
అనంతరం గ్రామంలోని షిర్డీ సాయిబాబా దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. దేవాలయ చైర్మన్ పి . నరసింహారావు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రూపాయల విరాళాన్ని మంత్రి పార్థసారథికి అందించారు. ఈ సందర్భంగా నరసింహారావును మంత్రి పార్థసారథి అభినందించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మండల అధికారులు, కూటమి నాయకులు , గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.