*ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 21, 2024*
ముంపు నష్టం నమోదుకు మరో అవకాశం
సచివాలయాల్లో నష్ట గణన జాబితాల ప్రదర్శన
– ఇంకా ఎవరైనా మిగిలిఉంటే ఆది, సోమవారాల్లో నమోదు.
– నష్టం, కష్టం కలిగిన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని ప్రభుత్వ నిర్ణయం.
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ అర్బన్ కు సంబంధించి 179 సచివాలయాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట గణన ప్రక్రియ నిర్వహించడం జరిగిందని.. నష్టం కలిగిన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ఉదయం సచివాలయాల్లో ఎన్యుమరేషన్ జాబితాలను ప్రదర్శించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆయా సచివాలయాలను, ప్రత్యేక అధికారులను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆది, సోమవారాల్లో సచివాలయాల పరిధిలోనే వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఐఏఎస్ అధికారులు కూడా తుది దశ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నష్టం, కష్టం కలిగిన ఏ ఒక్కరూ ఎన్యుమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి తుది జాబితాలను రూపొందించి పంపించాలని ఇప్పటికే ఆయా వార్డుల ప్రత్యేక అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నష్టగణన వివరాల నమోదు ప్రక్రియను రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.