ఎన్టీఆర్ జిల్లా, జూన్ 16, 2025
మాదక ద్రవ్యాల మహమ్మారిపై మూకుమ్మడి దాడి!
- అన్ని విద్యాసంస్థల్లోనూ ఈగల్ క్లబ్స్ ఉండాల్సిందే
- క్యాంపస్ అంబాసిడర్లనూ నియమించాలి
- పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి చేయీచేయీ కలుపుదాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్ర సాకారం దిశగా అడుగులేస్తూ మూకుమ్మడి దాడితో మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు చేయీచేయీ కలుపుదామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలు తదితరాలపై సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. ఇందుకు ఈగల్ (Elite Anti narcotics Group for Law Enforcement) క్లబ్స్తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని ఆదేశించారు. వీటి సభ్యులకు వర్క్షాప్స్ నిర్వహించి.. డ్రగ్స్ అంటే ఏమిటి? డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిని గుర్తించడం ఎలా? సున్నితంగా సమస్యను ఎలా పరిష్కరించాలి? తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. హాట్స్పాట్స్ను గుర్తించి.. ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాలు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయనే విషయాలను క్షుణ్నంగా వివరించాలన్నారు. అదేవిధంగా పోస్టల్, కొరియర్ సంస్థల సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జనజాగృతికి అవసరమైన లఘు చిత్రాలు, కరపత్రాలు వంటివాటిని రూపొందించాలని ఆదేశించారు. యోగాంధ్ర మాసోత్సవాలు ముగిసిన అనంతరం నెల రోజుల పాటు విస్తృత స్థాయిలో మాదక ద్రవ్యాలపై పోరాటానికి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ శాఖలు, ఎన్జీవోలు, డీఎల్ఎస్ఏ నిపుణులు తదితరుల భాగస్వామ్యంతో పెద్దఎత్తున ర్యాలీలు, వాకథాన్లు, సదస్సులు వంటి వాటిని నిర్వహించనున్నామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
*జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్, ఈగల్ బృందాలు తీసుకుంటున్న చర్యలను డీసీపీ కేజీవీ సరిత వివరించారు. యాంటీ నార్కోటిక్స్ స్వ్కాడ్స్, టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ వివరాలను తెలియజేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 73 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశామని, 175 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. 1,054 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు వివరించారు. మూలాలను ఛేదించే విషయంపై ప్రత్యేక ఆపరేషన్స్ చేపడుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. సమన్వయ శాఖల అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు .. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్ఫ్రీ నంబరు 1972 ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, డీ అడిక్షన్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా. స్వరాజ్య లక్ష్మి, ఈగల్ ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.