Home Andhra Pradesh మహిళలు మరియు బాలల భద్రత మరియు రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం.

మహిళలు మరియు బాలల భద్రత మరియు రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం.

2
0

 *ప్రెస్ నోట్*

మహిళలు మరియు బాలల భద్రత మరియు రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం.

డిసెంబరు 05, విజయవాడ:  మహిళలు, బాలల భద్రత వారి రక్షణే  ప్రధాన ధ్యేయంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యాల నుండి వచ్చిన మరియు వివిధ రకాల హింసలకు గురవుతున్న మహిళలు మరియు బాలల భద్రత కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి ఎ. సూర్య కుమారి, IAS అన్నారు. 

లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 16 రోజుల ప్రచారంలో భాగంగా హెల్ప్ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ  నిర్వహించిన “ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు మరియు బాలికల భద్రత మరియు రక్షణ పై రెండు రోజుల రాష్ట్ర స్థాయి కార్య శాల” కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఆంధ్ర ప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలు, కార్యకర్తలు అంకిత భావంతో తమ విధులను నిర్వర్తిస్తూ ప్రశంసనీయమైన వారి సేవల ద్వారా మహిళలు బాలలకు ఆహార భద్రత కల్పించడంలో భారతదేశం మొత్తంలో అత్యుత్తమ స్థానాన్ని పొందాయని మహిళా శిశు సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి అన్నారు. లైంగిక వేధింపులు, దోపిడీ మరియు అక్రమ రవాణాతో పాటు లింగ ఆధారిత హింసతో సహా వివిధ రకాల హింసలకు గురయ్యే ప్రమాదంలో ఉన్న మహిళలు మరియు బాలికలను గుర్తించడo, వారి భద్రత మరియు రక్షణ అంశాలకు సంబంధించి కూడా వారి అత్యుత్తమ సేవలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు స్థాయి నుండి పై వరకూ డిపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ సంబంధిత అంశాలపై తగినంత జ్ఞానం కలిగి ఉండాలని,  మరియు వారి సమగ్ర అభివృద్ధికి, రక్షణకు భాద్యులైన ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ వారి మానసిక-సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య అవసరాలను తీర్చడంలో, వారికి అవసరమైన సేవలు అందించడంలో వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలన్నారు. అక్రమ దత్తతలను నిరోధించడంలో దత్తత ఏజెన్సీల కీలక బాధ్యతను నిర్ధారిస్తూనే, వదిలివేయబడ్డ బాలలకు ఫోస్టర్ కేర్ ద్వారా పెంపుడు, సంరక్షణ సహాయాన్ని డిపార్ట్‌మెంట్ యొక్క ప్రాధాన్యమైన చర్యగా ప్రోత్సహించాలని ఆమె సూచించారు. మానవ అక్రమ రవాణా నుండి రక్షించబడిన వారు ప్రాథమిక అవసరాలు మరియు కౌన్సెలింగ్ మరియు నైపుణ్య శిక్షణల కోసం షెల్టర్ హోమ్‌లలో కొంత కాలం గడిపిన తర్వాత, కమ్యూనిటీ ఆధారిత పునరావాసం ద్వారా అవసరమైన రాష్ట్ర సహాయ సేవలతో మెరుగైన సేవలను అందిస్తే వారికి సరైన పునరావాస సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల హింసలకు గురైన భాదిత మహిళలు, బాలలకు సమర్థవంతమైన సేవలను అందించడంలో ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థల మధ్య సమన్వయాన్ని నిర్మించడం మరియు బలోపేతం చేయడం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

కార్య శాలకు అధ్యక్షత వహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ – స్కీమ్‌లు, శ్రీమతి వై. శైలజ మాట్లాడుతూ భాదిత మహిళలు, బాలల పునరావాసం కోసం శాఖ అధ్వర్యంలో నడుపుతున్న సంబంధిత ప్రభుత్వ షెల్టర్ హోమ్‌ల ద్వారా తక్షణ ప్రతిస్పందనను, అవసరమైన చర్యలను  ప్రారంభించాలన్నారు. మానవ అక్రమ రవాణా భాదితులకు సంబంధిత చట్టాలను అనుసరించి సామాజిక దృక్పథంలో తగిన సేవలను విస్తరించాలని ఆమె శక్తి సదన్ గృహాల సిబ్బందికి సూచించారు. బాధితులు బలహీనమైన నేపథ్యాల నుండి వచ్చినందున వారి బాధలను ఎదుర్కొనేందుకు తగిన సహాయ సహకారాలను అందిస్తూనే వారి సామాజిక-ఆర్థిక సాధికారత దిశగా చర్యలు చేపట్టడం తో బాటు వారి కేసుల స్థితిని పర్యవేక్షించడానికి జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థల కార్యాలయాల నుండి సంబంధిత నోడల్ అధికారులు మరియు ఇ.ఓ. లు  భాద్యత తీసుకోవాలన్నారు.

హెల్ప్ సంస్థ సెక్రటరీ రామ్ మోహన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా మరియు లైంగిక వేధింపులు & దోపిడీ మరియు ఇతర రకాల హింసలను అరికట్టడానికి మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం, 1956. పోక్సో చట్టం, 2012 మరియు గృహ హింస (నిరోధక)చట్టం, 2005. వంటి అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. కానీ, ఏ చట్టంలోనూ పునరావాసం కోసం నిర్దిష్టమైన మరియు స్పష్టమైన నిబంధనలు లేవు భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం మానవ అక్రమ రవాణా మరియు వ్యాపార లైంగిక దోపిడీ భాదిత మహిళల పునరావాసం కోసం జీ.ఓ.ఎం.ఎస్. 1, 2003 మరియు వారి తక్షణ సహాయం కోసం జీ.ఓ ఎం.ఎస్ 28 ని రూ. 20,000 లతో   ప్రవేశ పెట్టిందని అని ఆయన విశదీకరించారు. దురదృష్టవశాత్తు, రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి ఈ జీ.ఓ. లు నిష్క్రియంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ (సి.బి.ఆర్)  మోడల్ ద్వారా ట్రాఫికింగ్ నుండి రక్షించబడిన భాదితుల పునరావాసం కోసం ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు కలిసికట్టుగా ఉమ్మడి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన అభ్యర్థించారు. ఈ కమ్యూనిటీ ఆధారిత పునరావాసంలో భాదిత మహిళల సామాజిక-ఆర్ధిక సాధికారతకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు, వారికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడానికి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. 

కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ప్రాజెక్ట్ డైరెక్టర్లు శ్రీమతి సువర్ణ మరియు శ్రీమతి ఉమ తమ జిల్లాల నుండి మహిళలు మరియు బాలల రక్షణ మరియు సంక్షేమంలో ఉన్న సమస్యలు మరియు సవాళ్లను పరిష్కరించడం గురించి, దీనికిగాను   ఇప్పటికే అమలులో ఉన్న రక్షణ యంత్రాంగాలు మరియు వ్యవస్థలపై అవగాహన కల్పించడం గురించి వివరించారు. డిపార్ట్‌మెంట్‌లో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న సిబ్బంది మహిళలు మరియు బాలలకు అత్యుత్తమ సేవలను అందించడంలో వారి సామర్థ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్వహించే శిక్షణలు మరియు వర్క్‌షాప్‌లను, IE C మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 

ఈ కార్య శాలలో రాష్ట్రం లోని 26 జిల్లాల నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారులు, ఈ.ఓ.లు, శక్తి సదన్‌ల, వన్‌స్టాప్ సెంటర్‌ల నిర్వహణాధికారులు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లు, స్వచ్చంద సంస్థలు, హెల్ప్ సిబ్బంది మరియు విముక్తి కలెక్టివ్ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here