మహిళలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
దిత్య హృదయం ప్రతినిధిప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్లో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపార గౌరవమని.. ఆడపడుచుల సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తునన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నవరత్నాల్లో 7 పథకాలను ఆడపడుచుల పేరిట అందించి, మహిళా లోకం గర్వపడేలా చేశారన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం.. ఇలా ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వామ్యం చేసి అసలైన మహిళా సాధికారత ఏంటో ఆచరణలో చూపారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులకు ఐదేళ్ల కాలంలో అక్షరాల రూ.1,89,519 కోట్ల సంక్షేమ లబ్ధిని చేకూర్చగా.. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూ. 402.46 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 34,300 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 118 కోట్ల 61 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 44,370 మందికి రూ. 26 కోట్ల 25 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,654 మందికి రూ. 58 కోట్ల 99 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,088 మందికి రూ. 21 కోట్ల 24 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి రూ. 6 కోట్ల 81 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించడం ద్వారా కేవలం ఐదేళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం విజయం సాధించిందని తెలియజేశారు.
మహిళా సంక్షేమంపై చర్చకు సిద్ధమా..?
మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గూర్చి మాట్లాడే అర్హత కూటమి నేతలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. అక్షరాలా రూ. 14,205 కోట్ల రుణ మొత్తాన్ని చెల్లించకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కచెల్లెమ్మలను మోసగించిందని ఆరోపించారు. మీ హయాంలో ‘ఎ’ గ్రేడ్ గా ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమై ‘సి’ గ్రేడ్లోకి పడిపోయింది వాస్తవం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను జగనన్న అన్వేషించారని.. ప్రభుత్వ పరంగా వారికి ఎంతవరకు సహాయసహకారాలు అందించాలో అన్నీ చేశారన్నారు. కీలక మంత్రిత్వ శాఖలు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో ఆడపడుచులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. అలాగే రాష్ట్రంలోని మహిళలు ధైర్యవంతులు అనేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి శక్తినిచ్చారని.. ఆడపడుచుల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఏకంగా 1.46 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్ ను డౌన్లోడ్ చేసినట్లు వెల్లడించారు. ఆపదలో ఉన్నామని యాప్ ద్వారా సమాచారం ఇస్తే.. క్షణాల్లో సహాయం అందుతోందని పేర్కొన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తున్నారని తెలియజేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచినట్లు మల్లాది విష్ణు తెలిపారు.
బాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసగించడమే
ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల బాబు అనుభవం మహిళల ఆర్థికాభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదని మల్లాది విష్ణు విమర్శించారు. తన 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్క మహిళ మన్ననలు కూడా చంద్రబాబు పొందలేకపోయారన్నారు. మద్యపాన నిషేధం ఎత్తివేత, అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించడం, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు, విపరీతంగా బెల్టు షాపులు పెట్టించడం.. ఇవి అధికారంలో ఉండగా చంద్రబాబు సాధించిన ఘన విజయాలన్నారు. 2014 నుంచి 2018 వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ప్రతి ఏటా పెరుగుతూనే వచ్చాయని మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదైతే.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాలే 44,780 కేసులు ఉన్నాయన్నారు. ఆనాడు చంద్రబాబు పాలన ముగిసే నాటికి 2018 జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అటువంటి చంద్రబాబు భయానక పాలనను మహిళలు ఎన్నటికీ మర్చిపోరని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం నేతల తీరు మారలేదని.. రాజమండ్రిలో మహిళను కించపరిచేలా బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికలలో తాము ఎవరిని గెలిపించుకోవాలో ఆడపడుచులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, ఆయన మిత్రపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా విఫలమవక తప్పదని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.