*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 25, 2025*
మహా శివరాత్రి పుణ్య స్నానాలకు పటిష్ట ఏర్పాట్లు..
– *భక్తులకు ఇబ్బంది లేకుండా సీనియర్ అధికారుల పర్యవేక్షణ*
– *ఘాట్లలో జల్లు స్నానాలు, డ్రెస్ ఛేంజింగ్ రూమ్ల ఏర్పాటు*
– *ఎన్టీర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మంగళవారం తెలిపారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, వీఎంసీ, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దుర్గా ఘాట్, పిండ ప్రదానం ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, వీఐపీ ఘాట్ తదితరాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందన్నారు. నిరంతర గస్తీతో పాటు క్యూలైన్లు, బ్యారికేడింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమైన పున్నమి, భవానీ ఘాట్లు తదితరాల వద్ద జల్లు స్నానాలు, డ్రెస్ ఛేంజింగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, నిరంతర పారిశుద్ధ్యం ఏర్పాట్లు ఉంటాయన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఘాట్ల వద్ద వెలుతురు సరైన విధంగా ఉండేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద సుశిక్షితులైన గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గొల్లపూడి, సూరయపాలెం, పవిత్ర సంగమం వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ విస్తరణ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.